ప్రధాని టూర్​కు సీఎం డుమ్మా

ప్రధాని టూర్​కు సీఎం డుమ్మా
  • పొలిటికల్​ హీటే కారణమా?
  • పీఎంకు  ఎయిర్​పోర్టులో స్వాగతం, వీడ్కోలు పలికిన మంత్రి తలసాని
    హైదరాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ టూర్​కు సీఎం కేసీఆర్‌‌  డుమ్మా కొట్టారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రికి ప్రొటోకాల్​ ప్రకారం స్వాగతం పలకాల్సిన ఆయన ప్రగతిభవన్​కే పరిమితమయ్యారు. అయితే.. టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య పొలిటికల్​ హీట్​ పెరగడం వల్లే  ప్రధాని పర్యటనకు సీఎం డుమ్మా కొట్టినట్లు తెలుస్తున్నది. శనివారం హైదరాబాద్​కు ప్రధాని మోడీ రాగా.. గవర్నర్​ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ శంషాబాద్‌‌ ఎయిర్​ పోర్ట్​లో స్వాగతం పలికారు. 

    ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రధానిని స్వాగతించి సాయంత్రం వరకు ఆయన వెంట వివిధ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్​ పాల్గొనాలని షెడ్యూల్​లో ఉంది. ఇక్రిశాట్‌‌ స్వర్ణోత్సవాలతో పాటు ముచ్చింతల్‌‌ చినజీయర్​ ఆశ్రమంలోని రామానుజుల విగ్రహావిష్కరణలో ప్రధానితోపాటు పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రోగ్రాంలన్నింటికీ కేసీఆర్​ దూరంగా ఉండటం రాజకీయంగా ఊహాగానాలకు తెరలేపింది. 
    స్వాగతం పలుకుతానని చెప్పి..! 
    గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్​ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఐదు రోజుల కింద కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్​ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్​పై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే.. ప్రొటోకాల్​ ప్రకారం వెళ్లి స్వాగతం పలుకుతానని అదే రోజు మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్​ బదులిచ్చారు. కానీ.. శనివారం రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి మాత్రం ఆయన స్వాగతం పలకలేదు. ఉదయం నుంచి ప్రగతిభవన్​లో కేసీఆర్​ ఉన్నారు. బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య వైరం పెరిగినందునే ప్రధాని మోడీ ప్రోగ్రామ్​కు సీఎం అటెండ్​ కాలేదని తెలుస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్​ బై ఎలక్షన్ల తర్వాత బీజేపీకి, టీఆర్​ఎస్​కు ‘నువ్వా నేనా’ అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్నది. ఇటీవల ధాన్యం సేకరణపై సీఎం హోదాలో కేసీఆర్​ ఆందోళన చేయడం, కేంద్ర బడ్జెట్​ను విమర్శిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​పై రాజకీయ విమర్శలకు మించి మాట్లాడటాన్ని బీజేపీ  సీరియస్ గా తీసుకుంది. ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని సీఎం చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ పొలిటికల్​ హీట్​లో ప్రధానిని నేరుగా కలుసుకునేందుకు కేసీఆర్​ వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. గురువారమే ముచ్చింతల్​కు వెళ్లి రామానుజ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన కేసీఆర్​.. చివరి క్షణంలో ప్రధాని టూర్​కు వెళ్లకపోవటం వెనుక ఇటీవలి రాజకీయ పరిణామాలే కారణమనే చర్చ నడుస్తున్నది. 
    ఒక్కరోజు ముందు తలసానికి బాధ్యతలు 
    ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే బాధ్యతలను ఆయన టూర్​కు ఒక్కరోజు ముందు అంటే శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​కు సీఎం కార్యాలయం అప్పగించింది. ప్రధాని పర్యటనకు మంత్రి తలసానిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నామినేట్​ చేసినట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సీఎంవో అఫీషియల్​గా జీఏడీకి  లెటర్​ రాసింది. ఈ లెటర్​ను మీడియాకు లీక్​ చేయటంతో.. కేసీఆర్​ పీఎం టూర్​కు వెళ్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కనీసం ముచ్చింతల్​కార్యక్రమంలోనైనా పాల్గొంటారని  చివరి వరకు చర్చ జరిగింది. కానీ ఇక్రిశాట్​ కార్యక్రమంతోపాటు రామానుజుల విగ్రహావిష్కరణకు కూడా ఆయన హాజరుకాలేదు. ప్రధానితో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతోనే డుమ్మా కొట్టినట్లు చర్చలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి ప్రధాని వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో అటెండవుతానని, అందులో డౌట్​ ఎందుకని మొన్న ప్రెస్​మీట్​లో చెప్పిన కేసీఆర్​.. తీరా ప్రధాని పర్యటన టైమ్​లో మాత్రం దూరంగా ఉండటం, అసలు కారణమేమిటో సీఎంవో నుంచి కూడా అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడం హాట్​ టాపిక్​గా మారింది.