
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ దేశంలోని విమానాశ్రయాలు లక్ష్యంగా.. ఇజ్రాయెల్ విస్సైల్స్ దాడులకు తెగబడింది. ఇరాన్ లోని పశ్చిమ, తూర్పు, మిడిల్ ప్రాంతాల్లోని మూడు ఎయిర్ పోర్టులపై బాంబులు వేసింది. అదే విధంగా టెహ్రాన్ లోని మెహ్రాబాద్, మషద్, డెజ్ ఫుల్ ఏరియాలో మరో మూడు ఎయిర్ పోర్టులపైనా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన 15 విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పదుల సంఖ్యలో హెలికాఫ్టర్లు సైతం పేలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో.. విమానాశ్రయంలో రన్ వేపై ఉన్న F14, F 5, AH 1 యుద్ధ హెలికాప్టర్లు, జెట్ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అవి ఉపయోగించటానికి వీలు లేకుండా ధ్వంసం అయ్యాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సైనిక బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడులు చేశామని.. విజయవంతం అయినట్లు కూడా వెల్లడించింది ఇజ్రాయెల్ ఆర్మీ.
ఇజ్రాయెల్ దేశంపై బాలిస్టిక్ మిస్సైల్స్, క్లస్టర్ బాంబులు వేసేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున వ్యూహాలు రచించిందని.. యుద్ధ విమానాలను సిద్ధం చేసిందని.. ఈ సమాచారం ఆధారంగానే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ IDF.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధంగా ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలను నాశనం చేశామని ప్రకటించింది ఐడీఎఫ్.
ALSO READ | పుర్రెపై ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం వార్నింగ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..?
ఈ దాడుల క్రమంలో.. పశ్చిమ ఇరాన్ లోని ఖరోమాబాద్ ఏరియాలో డ్రోన్ విమానం ఒకటి కూలిపోయిందని.. దీని వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. ఆరు ఎయిర్ పోర్టులపై జరిగిన దాడిలో ఇరాన్ సైన్యం ఎంత మంది చనిపోయారు అనేది విషయంపై రెండు దేశాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగటం.. ఆరు ఎయిర్ పోర్టుల్లోని 15 యుద్ధ విమానాలను నాశనం చేయటం ఇరాన్ దేశానికి ఎదురుదెబ్బనే.. మొదటి నుంచి ఇరాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. ఈసారి దాన్ని తీవ్రతరం చేసింది.