ఇరాన్ గుండెపై గాయం చేశాం: ఇజ్రాయెల్ పీఎం

ఇరాన్ గుండెపై గాయం చేశాం: ఇజ్రాయెల్ పీఎం

ఇరాన్‌‌పై ఐడీఎఫ్​ జరిపిన దాడులపై ఇజ్రాయెల్‌‌ ప్రధాని బెంజమిన్‌‌ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్‌‌పై ‘ఆపరేషన్‌‌ రైజింగ్‌‌ లయన్‌‌’ ప్రారంభించామని ప్రకటించారు. ఇరాన్‌‌ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌‌ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్‌‌గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఆ దేశ అణు కార్యక్రామాలను తాము ఇంకెంత కాలం భరించాలని అన్నారు.

ఇజ్రాయెల్​ దేశ చరిత్రలోనే గొప్ప విజయం సాధించామని, ఇరాన్​ అణు కార్యక్రమానికే గుండెకాయలాంటి స్థావరాలను ధ్వంసం చేసినట్టు చెప్పారు. ఇరాన్​ ముప్పును తప్పించుకోవడానికి ఈ ఆపరేషన్​ను ఎన్నిరోజులైనా కొనసాగిస్తామని వెల్లడించారు.   కాగా, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్‌‌ డిఫెన్స్‌‌ ఫోర్సెస్‌‌ చీఫ్‌‌ ఆఫ్‌‌ స్టాఫ్‌‌ లెఫ్టినెంట్‌‌ జనరల్‌‌ జమీర్‌‌ తెలిపారు తమను నాశనం చేయాలనుకునే వారి ముందు తలవంచే ప్రసక్తే లేదని, తమ అస్థిత్వాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామన్నారు.

ఇజ్రాయెల్​కు గట్టిగా బదులిస్తాం: ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ
తమ దేశంపై దాడి చేసిన ఇజ్రాయెల్​కు గట్టిగా బదులిస్తామని ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు.  ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటామని, కఠినంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. ఇరాన్​లోని నివాస కేంద్రాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నదని ఫైర్​అయ్యారు. కాగా,  ఇజ్రాయెల్​ దాడులపై తాము మౌనంగా ఉండబోమని ఇరాన్​ అధ్యక్షుడు మసౌద్​ పెజెష్కియన్​ అన్నారు. శత్రువు తన మూర్ఖపు ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందేలా తాము ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.