
ఇరాన్పై ఐడీఎఫ్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఆ దేశ అణు కార్యక్రామాలను తాము ఇంకెంత కాలం భరించాలని అన్నారు.
ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే గొప్ప విజయం సాధించామని, ఇరాన్ అణు కార్యక్రమానికే గుండెకాయలాంటి స్థావరాలను ధ్వంసం చేసినట్టు చెప్పారు. ఇరాన్ ముప్పును తప్పించుకోవడానికి ఈ ఆపరేషన్ను ఎన్నిరోజులైనా కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ తెలిపారు తమను నాశనం చేయాలనుకునే వారి ముందు తలవంచే ప్రసక్తే లేదని, తమ అస్థిత్వాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామన్నారు.
ఇజ్రాయెల్కు గట్టిగా బదులిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
తమ దేశంపై దాడి చేసిన ఇజ్రాయెల్కు గట్టిగా బదులిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని, కఠినంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. ఇరాన్లోని నివాస కేంద్రాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నదని ఫైర్అయ్యారు. కాగా, ఇజ్రాయెల్ దాడులపై తాము మౌనంగా ఉండబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ అన్నారు. శత్రువు తన మూర్ఖపు ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందేలా తాము ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.