ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 200 ఫైటర్ జెట్స్తో అటాక్

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 200 ఫైటర్ జెట్స్తో అటాక్
  • 200 ఫైటర్ జెట్స్తో అటాక్.. ‘ఆపరేషన్​ రైజింగ్​ లయన్’​ పేరుతో ఎయిర్​స్ట్రైక్స్​
  • ఇరాన్​ ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్స్​ చీఫ్​ సహా మిలిటరీ ఆఫీసర్స్, సైంటిస్టులు మృతి
  • నటాంజ్​ న్యూక్లియర్​ సైట్​ ధ్వంసం.. వందల డ్రోన్లు, మిసైల్స్​తో​ ఇరాన్​ ప్రతీకార దాడి
  • మాకు ముప్పు తొలిగేదాకా దాడి చేస్తం: ఇజ్రాయెల్​ పీఎం నెతన్యాహు
  • ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటం: ఇరాన్ ​సుప్రీం లీడర్​ ఖమేనీ
  • పరిస్థితి చేయిదాటకముందే అణు ఒప్పందానికి రండి: ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్

టెహ్రాన్: పశ్చిమాసియాలో మరో యుద్ధమేఘం కమ్ముకున్నది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్​పై ఇజ్రాయెల్​ భీకర దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం రెండు దఫాలుగా ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాలపై ఎయిర్​స్ట్రైక్స్​ చేసింది.  ‘ఆపరేషన్​ రైజింగ్​ లయన్​’ పేరుతో న్యూక్లియర్​ ప్లాంట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్మీ చీఫ్​ మహ్మద్​ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండర్​ ఇన్​ చీఫ్​ హొస్సేన్​ సలామీ సహా పలువురు టాప్ మిలిటరీ కమాండర్స్, ఇద్దరు సైంటిస్టులు మృతి చెందారు.

శుక్రవారం వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్​పై ఇరాన్​ దాడి చేసింది. తమ ప్రతీకార దాడి మొదలైందని హెచ్చరించింది. కాగా, సలామీ మృతిని ఇరాన్‌‌ అధికారిక మీడియా సంస్థ ధ్రువీకరించింది. ఇరాన్ సైనిక ద‌‌ళాల్లో అత్యున్నత ర్యాంక్ క‌‌లిగిన ఆఫీస‌‌ర్ భాఘేరి. ఇజ్రాయెల్ జ‌‌రిపిన దాడిలో మృతిచెందిన వ్యక్తుల్లో బాఘేరీ రెండో కీల‌‌క వ్యక్తిగా నిలిచారు. 1980లో జరిగిన ఇరాన్​–ఇరాక్​ యుద్ధం తర్వాత ఇరాన్​ అణుస్థావరాలు, క్షిపణి కేంద్రాలపై జరిగిన పెద్దదాడి ఇదే కావడం గమనార్హం.

200 ఐఏఎఫ్​ విమానాలు.. 330 బాంబులు
గురువారం అర్ధరాత్రి దాటాక టెహ్రాన్‌‌పై ఇజ్రాయెల్‌‌ దాడులు ప్రారంభించింది.  శుక్రవారం ఉదయం కూడా రెండో దశ అటాక్స్​ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక ద‌‌ళానికి చెందిన యుద్ధ విమానాల వీడియోను ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్ (ఐడీఎఫ్)  రిలీజ్ చేసింది. ఇరాన్‌‌పై జ‌‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్నట్టు వెల్లడించింది. ఆ ఫైట‌‌ర్ జెట్స్​ ద్వారా సుమారు 330 బాంబుల‌‌ను జార విడిచామని, సుమారు వంద ప్రదేశాల్లో వాటిని పేల్చిన‌‌ట్టు ఐడీఎఫ్​ పేర్కొన్నది. ఈ దాడిలో ఇరాన్​కు చెందిన కీలక ఆఫీసర్లు హతమైనట్టు తెలిపింది. ఇందులో ఇరాన్‌‌ ఆర్మీ చీఫ్​ మహ్మద్​ బాఘేరీ,  పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌‌ కమాండర్​ ఇన్​ చీఫ్​ హొస్సేన్​ సలామీసహా ఎయిర్​ఫోర్స్​ కమాండర్​ అమిరలీ హజీజాదే, డ్రోన్​ ఫోర్స్​ కమాండర్, ఏరియల్​కమాండర్​ చీఫ్​ కూడా ఉన్నట్టు వెల్లడించింది.

ఈ దాడిలో న‌‌టాంజ్ న్యూక్లియర్​సైట్ దెబ్బతిన్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.  కాగా,  ఆ కేంద్రంపై పలుసార్లు అటాక్​ చేసినట్టు ఇజ్రాయెల్​ వెల్లడించింది.  న‌‌టాంజ్‌‌లో అణు శుద్ధీకరణ జరుగుతున్నదని, ఇక్కడ అండ‌‌ర్‌‌గ్రౌండ్‌‌లో న్యూక్లియ‌‌ర్ సైట్ ఉన్నట్టు ఇజ్రాయిల్ ఆరోపించింది.  న‌‌టాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో దట్టమైన పొగలు వస్తున్న విజువ‌‌ల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేర‌‌కు డ్యామేజ్ జ‌‌రిగింద‌‌న్న దానిపై క్లారిటీ లేదు. కాగా, ఇజ్రాయెల్‌‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌‌ తన గగనతలాన్ని  మూసి వేసింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశంలో ఇంటర్నెట్​ సేవలను ఇరాన్​ నిలిపేసింది. 

రేడియేషన్​ లీక్​ జరుగలేదు: ఐఏఈఏ
ఇరాన్​లోని నటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) శుక్రవారం ధ్రువీకరించింది. “ఇరాన్​లో పరిస్థితిని ఐఏఈఏ  పరిశీలిస్తున్నది. రేడియేషన్ స్థాయిలకు సంబంధించి ఏజెన్సీ ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నదని. దేశంలోని మా ఇన్​స్పెక్టర్లతో మాట్లాడుతున్నాం” అని ఐఏఈఏ అధిపతి రాఫెల్ మారియానో గ్రాస్సి ఎక్స్​లో పోస్టు చేశారు. న‌‌జాంట్ అణు కేంద్రంపై దాడి త‌‌ర్వాత అక్కడ ఎలాంటి రేడియేష‌‌న్ లీక్ జ‌‌ర‌‌గ‌‌లేద‌‌ని  వెల్లడించారు. రేడియేష‌‌న్ లెవల్స్ పెర‌‌గ‌‌లేద‌‌ని స్పష్టం చేశారు. దాడుల స‌‌మ‌‌యంలో బుషేహ‌‌ర్ న్యూక్లియ‌‌ర్ పవ‌‌ర్ ప్లాంట్‌‌ను ఇజ్రాయెల్​ టార్గెట్ చేయ‌‌లేద‌‌ని తెలిపారు.

ఇజ్రాయెల్ దాడి టైంలో ఇరాన్ గగనతలం ఖాళీ
టెహ్రాన్: ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్‌‌లోని న్యూక్లియార్ ఫెసిలిటీస్, క్షిపణి నిర్మాణ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ గగనతలంలో విమానాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఫ్లైట్‌‌రాడార్24 వెబ్ సైట్ ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల టైంలో ఇరాన్ గగనతలం పూర్తిగా ఖాళీ అయింది. విమానాలన్ని వేగంగా రూట్ మార్చుకుని.. ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులను తప్పించుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నట్లు వీడియోల్లో కనిపించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్, ఇరాక్, సిరియా దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీనివల్ల పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మరికొన్నింటికి ఇంధన ఖర్చులు పెరిగాయి.

ప్రతీకార దాడికి దిగిన ఇరాన్​
ఎయిర్​స్ట్రైక్స్​ జరిగిన కొన్ని గంటల్లోనే  ఇజ్రాయెల్‌‌పై  ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. సుమారు 100 డ్రోన్లతో విరుచుకుపడింది. కొన్ని గంటల్లోనే ఇరాన్‌‌ వందకుపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్‌‌ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్‌‌ చీఫ్‌‌ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్‌‌ జనరల్‌‌ ఎఫీ డెఫ్రిన్‌‌ మాట్లాడుతూ.. ‘గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్‌‌పై ఇరాన్‌‌ 100కు పైగా డ్రోన్స్​ను ప్రయోగించింది. వాటిని మా దళాలు కూల్చివేశాయి. ఇరాన్‌‌ దాడులను ఎదుర్కొనేందుకు మా సైన్యం పనిచేస్తున్నది” అని తెలిపారు. ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 200 ఫైటర్ జెట్స్​ ఆ దేశమంతటా దాదాపు 100 లక్ష్యాలను ఢీకొట్టాయని వెల్లడించారు. కాగా, శుక్రవారం రాత్రి కూడా వందలాది మిస్సైల్స్​తో ఇజ్రాయెల్​పై ఇరాన్​ విరుచుకుపడింది.