ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కార్టోశాట్ 3ని పీఎస్ఎల్వీ సీ47 బుధవారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దానితో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను కక్ష్యలో చేర్చింది. ఈ ప్రయోగంతో ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత రెండు దశాబ్దాల్లో 300లకు పైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిన సంస్థగా చరిత్ర సృష్టించింది. 1999 నుంచి ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 310 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీకి సంబంధించి ఇస్రోకు ఇది 47వ సక్సెస్ఫుల్ ప్రయోగం. 1993లో పీఎస్ఎల్వీ ప్రయాణం స్టార్టయింది. కానీ ఫస్ట్ ప్రయోగం విఫలమైంది. పేలోడ్ కక్ష్యలోకి చేరలేదు. తర్వాత 1994లో మళ్లీ ప్రయోగం చేశారు. అప్పుడు 804 కిలోల ఐఆర్ఎస్ పీ2ను కక్ష్యలో ప్రవేశపెట్టి సక్సెసయింది. 1997లో మాత్రం ప్రయోగం కాస్త అటు ఇటుగా జరిగింది. అనుకున్న ఆర్బిట్లో కాకుండా కాస్త కిందికి శాటిలైట్ను చేర్చింది.
మొత్తంగా చంద్రయాన్ సహా ఇప్పటివరకు 48 శాటిలైట్లను పీఎస్ఎల్వీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. మధ్యలో 2017లో పీఎస్ఎల్వీ సీ39 విఫలమైంది. ఈ ఏడాదివరకైతే ఇప్పటివరకు కార్టొశాట్తో కలిపి ఇస్రో 5 ప్రయోగాలు చేసింది. మరో 4 నెలల్లో 13 మిషన్స్ ప్లాన్ చేశామని.. వీటిల్లో ఆరు లాంచ్ వెహికల్, ఏడు శాటిలైట్ మిషన్లని ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు. ప్రస్తుతం తమకు చేతినిండా పని ఉందని అన్నారు. బుధవారం శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి ఎగిసిన 17 నిమిషాల్లోనే 509 కిలోమీటర్ల దూరంలో సన్ సింక్రొనస్ ఆర్బిట్లోకి కార్టొశాట్ను చేర్చింది. తర్వాత 10 నిమిషాలకే మిగిలిన 13 శాటిలైట్లను సంబంధిత ఆర్బిట్లలో ప్రవేశపెట్టింది. 1,625 కిలోల బరువున్న కార్టోశాట్ 3 ఈ సిరీస్లో తొమ్మిదవది. హై రిజొల్యూషన్ ఫొటోలు తీసే సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేశారు. 30 సెంటీమీటర్ల కన్నా తక్కువ రిజొల్యూషన్తో ఫొటోలు తీయగలదు. ఇస్రో ఇప్పటివరకు తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ కార్టొశాట్ 3 అని శివన్ చెప్పారు.