తమిళనాడుకి చెందిన కె. శంకర్, సెంథిల్... తండ్రీ కొడుకులు. ఈ ఇద్దరూ ఐఐటీల్లో చదివారు. మంచి ఉద్యోగాల్లో చేరారు. కానీ... ‘సొంతంగా ఏదైనా చేయాలి. అది నలుగురికీ ఉపయోగపడాలి’ అనే ఆలోచన శంకర్ది. దాంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. పర్యావరణానికి నష్టం కలిగించే పెట్ బాటిల్స్ను ఫ్లేక్స్, ఫైబర్గా మార్చే కంపెనీ పెట్టాడు. ఆ తరువాత కొడుకు కూడా తండ్రి బాటపట్టాడు. పెట్బాటిల్స్తో ‘ఎకోలైన్’ పేరిట ఫ్యాషన్ క్లోతింగ్ తయారుచేస్తున్నాడు. పెట్బాటిల్స్ను బట్టలుగా మార్చి రోజుకి 15 లక్షల పెట్ బాటిల్స్ చెత్త భూమ్మీద, సముద్రంలో పేరుకుపోకుండా ఆపగలిగాడు. అంతేకాదు ఈ క్లోతింగ్ బ్రాండ్ తమిళనాడు నుంచి పార్లమెంట్ వరకు ట్రావెల్ చేసింది కూడా!
ప్లాస్టిక్ టు గార్మెట్స్ జర్నీ గురించి 37 ఏళ్ల సెంథిల్ మాట్లాడుతూ ‘‘పెట్ బాటిల్స్ నుంచి క్లోతింగ్ తయారుచేస్తున్న నా గురించి చెప్పేకంటే ముందు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్న కె.శంకర్ పాలీమర్ ఇండస్ట్రీలో మంచి ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకు ఎంట్రప్రెనూర్ కావడం ఇష్టం. అందుకే పెట్ బాటిల్స్ను ఫ్లేక్స్గా మార్చే మైక్రోలెవల్ బిజినెస్ మొదలుపెట్టాడు. అయితే ఆ రోజుల్లో అంటే... 2008లో సస్టెయినబిలిటీ గురించి అంతగా ఎవరికీ తెలియదు. అదీకాక ఐఐటిలో చదువుకున్న ఇతనేంటి చెత్త బాటిల్స్ కలెక్ట్ చేస్తున్నాడని విచిత్రంగా చూసేవారు. ఆ పరిస్థితుల్లో తమిళనాడులోని వేరువేరు ప్రాంతాల నుంచి వేస్ట్ సేకరించడం కష్టంగా ఉండేది ఆయనకు. ఆ బిజినెస్ అప్పుడు అంత సక్సెస్ కాలేదు. కానీ ఆయన దాన్ని వదిలిపెట్టలేదు. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నా. మా అమ్మ కూడా ఐఐటీలో చదివింది. ఆమే మా కుటుంబ భారాన్ని మోసేది. నేను ఇంజినీరింగ్ డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ‘నా కొడుకు మంచి ఉద్యోగంలో చేరాలి’ అనుకున్నాడట మా నాన్న.
నాది ఆ అభిమానం కాదు
నాతోటి వాళ్లంతా గ్రాడ్యుయేషన్ తరువాత విదేశాల్లో స్థిరపడ్డారు. కానీ నేను మాత్రం విదేశాల్లో సెటిల్ కావాలి అనుకోలేదు. అక్కడికెళ్లి విదేశీ ప్రభుత్వాలకు ట్యాక్స్లు కట్టడం నచ్చలేదు. నా దేశాభిమానం క్రికెట్ మ్యాచ్లు చూసి చప్పట్లు కొట్టి సరిపెట్టుకునేది కాదు. నా దేశానికి నేనేదైనా తిరిగి ఇవ్వాలనుకున్నా. మూడేండ్లు ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేశా. కానీ అందులో తృప్తి అనిపించలేదు. ఆ ఉద్యోగం మానేశా. మా నాన్న నడుపుతున్న ‘శ్రీ రెంగ పాలిమర్స్ కంపెనీ’తో కలిసి ఎకోలైన్ పేరిట సస్టెయినబుల్ ఫ్యాషన్ క్లోతింగ్ బ్రాండ్ను 2021లో మొదలుపెట్టా. పెట్ బాటిల్స్ వాడి క్లోత్స్ తయారుచేస్తున్నాం. పెట్ బాటిల్స్ డిగ్రేడ్ కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. అదే ఈ పెట్ బాటిల్స్తో సస్టెయినబుల్ క్లోతింగ్ తయారుచేస్తే భూమ్మీద చెత్తగా చేరేందుకు కొంత టైం పడుతుందనే ఆలోచనే నన్ను క్లోతింగ్ వైపు నడిపించింది.
జీతాలకి లోన్లు...
నిజానికి పెద్ద వ్యాపారం చేయాలని చెన్నయ్లోని ఒక పాత బట్టల మిల్లు కొనాలనుకున్నాం మొదట్లో. ఆ కంపెనీ నడిపేంత డబ్బు చేతిలో లేదు. దానివల్లే మేం అనుకున్న ప్లాంట్ పెట్టడానికి ఏడాది టైం పట్టింది. కంపెనీ మొదలుపెట్టాక కూడా జీతాలు ఇవ్వడానికి లోన్స్ తీసుకున్నాం. మా పని మీద నమ్మకంతో మా ఉద్యోగులు కూడా కొంత ఇన్వెస్ట్ చేశారు. వాళ్లు మమ్మల్ని అంతగా నమ్మడం గర్వంగా అనిపిస్తుంది. మమ్మల్ని నమ్మిన వాళ్లు ఇప్పటికీ మాతోనే ఉన్నారు. టెక్స్టైల్ వాల్యూ చెయిన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. మేం ఒక మురికి ప్లాస్టిక్ బాటిల్ను ప్రెట్టీ గార్మెంట్గా మారుస్తున్నాం.
గత ఐదేళ్లలో ఎకోలైన్ క్లోతింగ్ ద్వారా81 లక్షల పెట్ బాటిల్స్ నేలలోకి, సముద్రాల్లోకి చెత్తలా పేరుకుపోకుండా చేయగలిగాం. ఈ క్లోతింగ్ గురించి విన్నప్పుడు ‘ప్లాస్టిక్ వేస్ట్నుంచి తయారుచేసిన బట్టల్ని ఎలా వేసుకుంటాం’ అని పెదవి విరుస్తారు చాలామంది. ఆ మైండ్సెట్ మార్చాలనేదే మా ప్రయత్నం. అందుకోసమే అందరూ ఇష్టపడేలా జాకెట్స్, బ్లేజర్స్, టీ–షర్ట్స్, బాటమ్స్ వంటి ఫ్యాషన్స్ తయారుచేస్తున్నాం. మా వెబ్సైట్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో వంటి ఇ–కామర్స్ పోర్టల్స్లో ఎకోలైన్ క్లోతింగ్ అందుబాటులో ఉంది.
నీళ్లు లేకుండా డైయింగ్
నిజానికి కన్వెన్షల్ డైయింగ్ పద్ధతిలో అయితే టెక్స్టైల్ డైయింగ్కు ఒక్కో ఏడాదికి 2.4 ట్రిలియన గ్యాలన్ల నీరు అవసరం పడుతుంది. అంతనీరు వాడకుండా మేం డోప్ డై టెక్నాలజీ వాడుతున్నాం. దానివల్ల ఒక్క చుక్క నీరు అవసరం లేకుండా డైయింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. కన్వెన్షనల్ మెథడ్లో నీళ్ల అవసరం ఎందుకు వస్తుందంటే... యార్న్ తయారుచేశాక డై చేస్తారు. దాన్ని శుభ్రం చేసేందుకు నీళ్లు అవసరం అవుతాయి. డోప్ డైయింగ్ పద్ధతిలో పెట్ బాటిల్స్ నుంచి పాలియెస్టర్ తయారయ్యేటప్పుడే రంగు కలిపేస్తాం. దానివల్ల ఫైబర్కు రంగు వేసేందుకు విడిగా నీరు అవసరం పడదు. ఈ టెక్నాలజీని ఇండియాలో చాలా కంపెనీలే వాడుతున్నాయి. అయితే మా ఒక్క కంపెనీనే ఎండ్ ప్రొడక్ట్కు ఈ పద్ధతి వాడుతోంది.
ప్రధాని వేసుకున్నాక...
ఫిబ్రవరి 2023లో మా బ్రాండ్కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మేం తయారుచేసిన నీలం రంగు సడ్రి జాకెట్ వేసుకుని పార్లమెంట్కు వెళ్లారు. ఆ జాకెట్ను 25 పెట్ బాటిల్స్ వాడి తయారుచేశాం. పార్లమెంట్కే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు కూడా ప్రధాని ఈ జాకెట్ వేసుకున్నారు. అలా జాతీయంగా, అంతర్జాతీయంగా మేం చేసిన హార్డ్వర్క్కు బ్రాండ్ వాల్యూ వచ్చింది. ప్రధాని వేసుకున్న తరువాత మా సేల్స్లో 25 శాతం పెరుగుదల కనిపించింది. మేం తయారుచేసే క్లోతింగ్ 500 నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉంది. నెలకి 20,000 ఆర్డర్లు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా ఎకోలైన్ వార్షికాదాయం రూ12 కోట్లు.
అదే పెద్ద ఛాలెంజ్
మా ఎదురుగా ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వినియోగదారుల మైండ్సెట్ మార్చడం. ఇవ్వాళ రేపు లగ్జూరీయస్, ఎక్కువ రేటు ఉన్న బట్టలు వేసుకోవడం స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాష్ నుంచి తయారుచేసిన ప్రొడక్ట్ వాడమని అడగడం కాస్త కష్టమైన పనే కదా! అయినప్పటికీ తక్కువ టైంలోనే ఆ మైండ్సెట్ మార్చగలం అనుకుంటున్నాం.
ఎంట్రప్రెనూర్షిప్ వల్ల పేరు, డబ్బు రావడమే కాదు. సమాజానికి, పర్యావరణానికి ఎంతోకొంత నేను కూడా ఇచ్చే అవకాశం కలిగింది. సముద్రంలోకి, భూమ్మీద కొన్ని లక్షల పెట్ బాటిల్స్ చెత్తగా పేరుకుపోకుండా చేయగలుగుతున్నా. కొన్ని వేల మంది చెత్త ఏరుకునేవాళ్లకు ఆర్థికసాయం చేయగలుగుతున్నా. నేను ఏ ఎమ్మెన్సీలోనే పనిచేస్తుంటే ఇప్పుడు నాకు దొరికిన ఆత్మసంతృప్తి దొరికేది కాదు. మా నాన్నకు మల్లే నేను కూడా ఉద్యోగం వదిలేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ఈ రోజున గర్వ పడుతున్నా” అని ముగించాడు.
పెట్ బాటిల్ నుంచి పాలియెస్టర్
పెట్ బాటిల్స్ను సేకరించి మాకు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో మొత్తం 50,000 మంది చెత్త ఏరే వాళ్లతో నెట్వర్క్ ఏర్పాటుచేసుకున్నాం. అలా సేకరించిన బాటిల్స్ను క్యూబ్స్గా కంప్రెస్ చేసి మాకు సప్లయ్ చేస్తారు. మేము వాటి క్యాప్స్, ర్యాపర్స్ వేరు చేస్తాం. ఆ తరువాత పెట్ బాటిల్స్ను క్రష్ చేసి 3–8 ఎం.ఎం సైజ్ ఫ్లేక్స్గా చేస్తాం. ఈ ఫ్లేక్స్లో తేమను తీసేందుకు డ్రై చేస్తాం. ఆ తరువాత ఫ్లేక్స్ను 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి ఫైబర్గా మార్చి చల్లబరుస్తాం. ఆ తరువాత పాలియెస్టర్ ఫైబర్ను మెటీరియల్ నుంచి వేరుచేసి ఆ ఫైబర్ను యార్న్గా చేస్తాం. అలా బట్టలు కుట్టే ఫ్యాబ్రిక్ తయారవుతుంది. తరువాత దాన్ని ఫ్యాషనబుల్ గార్మెంట్స్గా కుడతాం. ఒక టీ షర్ట్ తయారుచేసేందుకు ఎనిమిది పెట్ బాటిల్స్ పడతాయి. అదే జాకెట్కి అయితే 20 బాటిల్స్, బ్లేజర్ తయారీకి 30 బాటిల్స్ అవసరం.
‘‘దేశంలో ఉన్న వనరులన్నీ వాడుకుని, దేశానికి తిరిగివ్వాల్సిన టైంకి విదేశాలకి వెళ్లిపోతున్నారనేది నా అభిప్రాయం. నేను అలా చేయాలనుకోలేదు. అందుకే ఇక్కడే ఉండి నా దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడాలి అనుకున్నా.
నేను పనిచేస్తున్న రంగంలోనే నా కొడుకు కూడా రావడం అనేది మంచి విషయం. ఒక కాజ్ కోసం నా కంపెనీ పనిచేయడం అనేది నాకు చాలా తృప్తినిస్తోంది.
కె. శంకర్