
వాతావరణం చల్లగాఉన్నప్పుడు గరం గరం టీ తాగాలనిపిస్తుంది. కానీ, వీళ్లు టీ పార్టీతో గిన్నిస్ రికార్డు తెచ్చుకున్నారు. అవును... వీళ్లు టీ పార్టీ చేసుకుంది ఎక్కడో తెలుసా? ఎవరెస్ట్ పర్వతం మీద. ఎవరెస్ట్ క్యాంప్ 2లో... ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్న టైమ్లో టీ పార్టీ చేసుకున్నారు. చలికోటు వేసుకుని, వణుకుతున్న చేతులతో టీ కప్పు పట్టుకుని ఫొటోలు కూడా దిగారు. అమెరికాకు చెందిన ఆండ్రూ హ్యూస్ అనే అథ్లెట్, అడ్వెంచరర్ తన టీమ్తో కలిసి పోయిన ఏడాది ఈ టీ పార్టీ చేసుకున్నాడు. వీళ్ల టీ పార్టీని ఎత్తైన ప్లేస్లో జరిగిన టీ పార్టీగా ఈ మధ్యే గిన్నిస్ వాళ్లు గుర్తించారు. ‘‘కరోనా మొదలవ్వగానే ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. దాంతో, నాకు ఇష్టమైన పర్వాతారోహణకు బ్రేక్ పడింది. అప్పుడే మళ్లీ మౌంటెనీరింగ్కు వెళ్లినప్పుడు నా టీమ్తో కలిసి టీ పార్టీ చేసుకోవాలనిపించింది. ఎత్తైన పర్వతాల మీద, అది కూడా నేపాల్లో టీ తాగడం మరింత స్పెషల్. అయితే, మేం టీ పార్టీకి రెడీ అవుతుండగా మంచు కురవడం మొదలైంది. చిన్న టేబుల్ మీద టీ కప్స్ పెట్టి, కుర్చీల్లో కూర్చొని టీ తాగాం. ఈ పార్టీ చాలా రిలీఫ్గా అనిపించింది. వాతావరణం ఎలా ఉన్నా సరే.. ధైర్యంగా ముందు కు వెళ్లాలని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం” అని తమ టీ పార్టీ గురించి చెప్పాడు ఆండ్రూ.