
జన్నారం, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రిజిస్టర్,కిచెన్, ఆర్వో వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. క్లాస్ రూమ్లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
క్లాస్ రూముల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఇన్చార్జ్ వార్డెన్ గణేశ్ ను ప్రశ్నించారు. ఆర్వో ప్లాంట్ సైతం పని చేయకపోవడాన్ని గుర్తించి రెండు రోజుల్లో వీటిని బాగు చేయించాలని డీటీడీవో జనార్దన్ను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని వార్డెన్ను హెచ్చరించారు.