భద్రాచలం, వెలుగు : దళారులను దరి చేరనీయకుండా ఆదివాసీ గిరిజన మహిళా సొసైటీ సభ్యులే ఇసుక ర్యాంపులను నిర్వహించుకుని జీవనోపాధి పొందాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. చర్ల మండలంలోని గొమ్ముగూడెం ఇసుక ర్యాంపులో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వారికి జేసీబీని ఇచ్చి ఆయన శుక్రవారం ప్రారంభించారు.
సొసైటీ సభ్యులే బాధ్యతలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు, బినామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. గోదావరిలో ఇసుక తీత, నిర్వహణ, విక్రయం అన్నీ నిర్వహించుకోవాలని చెప్పారు. ప్రతీదీ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళా సొసైటీలకు ఐటీడీఏ ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్ అశోక్కుమార్, టీజీఎండీసీ పీవో శంకర్నాయక్, ఏడీ మైన్స్ దినేశ్కుమార్ పాల్గొన్నారు.
