నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది: మహారాష్ట్ర మంత్రి

నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది: మహారాష్ట్ర మంత్రి
  • కాన్ఫిడెన్స్‌ నన్ను కోలుకునేలా చేసిందన్న మంత్రి

ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారిన పడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్‌‌ అన్నారు. విల్‌పవర్‌‌, కాన్ఫిడెన్స్‌ తనను వ్యాధి నుంచి కోలుకునేలా చేసిందని ఆయన అన్నారు. మరో రెండు రోజుల పాటు వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత డిశ్చార్జ్‌ అవుతానని చెప్పారు. బీడీఏ, డవలపర్స్‌ బాడీ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు చెప్పారు. “ నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది. నేను జాగ్రత్తలు తీసుకోలేదు. సూచనలు పాటించలేదు. అందుకే కరోనా బారిన పడ్డాను. విల్‌పవర్‌‌, కాన్ఫిడెన్స్‌తో వ్యాధి నుంచి బయట పడగలిగాను. నేను నిజంగా చాలా అదృష్టవంతుడ్ని” అని జితేంద్ర అన్నారు. హిమోగ్లోబిన్‌ లెవల్‌ కూడా చాలా పెరిగిందని, కరెక్ట్‌ డైట్‌ ఫాలో అవుతున్నానని అన్నారు. ఎన్సీపీ నేత జితేంద్ర ఉద్ధవ్‌ థాక్రే కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా.. ఈ నెల మొదటివారంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. మహారాష్ట్ర కేబినెట్‌లోని మరో కాంగ్రెస్‌ మంత్రికి కూడా కరోనా సోకింది.