తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి..ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం..

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై  జాగృతి కార్యకర్తల దాడి..ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం..
  • గన్​మెన్​ చేతిలోంచి గన్​ లాక్కునే యత్నం
  • మల్లన్న గది తలుపులను బద్దలు కొడుతుండగా.. 
  • గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన గన్​మెన్​
  • తోపులాటలో తీన్మార్​ మల్లన్న చేతికి గాయం
  • పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరు?
  • ఇరువర్గాల ఫిర్యాదులు.. కేసులు నమోదు

 

అక్కడున్న ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. గన్​మెన్లు అడ్డుకోగా.. వారిపైనా చేయి చేసుకున్నారు. ఆ సమయంలో తీన్మార్​ మల్లన్న లోపలి గదిలో ఉండగా ఆయన వైపు దూసుకువెళ్లేందుకుప్రయత్నించారు. దీంతో ఓ గన్​మ్యాన్​ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు అక్కడున్న అద్దాలన్నీ పగలగొట్టారు. అద్దం ముక్కలు మీదపడి 8 మంది మల్లన్న స్టాఫ్​కు, అద్దాలు పగలగొట్టే క్రమంలో సుమారు 10 మంది జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆఫీసులోని గదులు రక్తపు మరకలతో నిండిపోయాయి. 

వీడియో తీయబోయిన మహిళపైనా దాడి

ఉదయం 11 గంటలకు క్యూ న్యూస్​ ఆఫీస్​కు వచ్చి ఆందోళనకు దిగి జాగృతి కార్యకర్తలను అక్కడున్న ఓ గన్​మ్యాన్​ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేశారు. గన్​ లాక్కునేందుకు ప్రయత్నించారు. తర్వాత గన్​మ్యాన్, స్టాఫ్​ను నెట్టేసుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చి.. పలు వస్తువులను ధ్వంసం చేశారు.  మల్లన్న ఏ చాంబర్​లో ఉన్నారో కనుక్కుని ఆ వైపుగా దూసుకువెళ్లారు. మల్లన్నను కలవడానికి వచ్చిన ఓ బాధితురాలు దీన్నంతా వీడియో తీయడానికి ప్రయత్నించగా.. ఆమెపైకి కుర్చీ విసిరేశారు. ఆమె భయపడి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. మల్లన్న చాంబర్​ వద్దకు వెళ్లిన జాగృతి కార్యకర్తలు తలుపు పెట్టి ఉండడంతో బాదారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అక్కడే ఉన్న మల్లన్న మరో గన్​మ్యాన్​ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా, జాగృతి కార్యకర్తలు తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో లోపల్నుంచి మల్లన్న, మరో ఇద్దరు తలుపులను గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో మల్లన్న చేతికి గాయమైంది.  

పోలీసుల ఎంట్రీతో.. ​

జాగృతి కార్యకర్తల దాడి గురించి తీన్మార్​ మల్లన్న స్టాఫ్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న జాగృతి కార్యకర్తలు పారిపోయారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజా రాణి, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. క్లూస్ ​టీమ్​ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. గాయపడ్డ మల్లన్నను చికిత్స కోసం ఘట్​కేసర్ ​ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారాణి.. ఏం జరిగిందని మల్లన్నతో పాటు అక్కడి స్టాఫ్​ను వివరాలడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారెవరైనా, ఎంతటి హోదాలో ఉన్న కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా, తీన్మార్​ మల్లన్న ఆఫీసులో దాడికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.  

బీఆర్​ఎస్​ సైలెంట్..

క్యూ న్యూస్​పై కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయడం, తాము శాంతియుత నిరసనకు వెళ్తే తమపైనే దాడికి దిగారని కవిత ఆరోపించడం వంటి పరిణామాలపై ఆమె సొంత పార్టీ బీఆర్​ఎస్​ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మల్లన్నను సస్పెండ్​ చేయాలంటూ కవిత మండలి చైర్మన్​కు ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ ఆఫీసుకు వచ్చి ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఆమె వెంట ఒక్క బీఆర్​ఎస్​ నేత కానీ, కార్యకర్త కానీ రాలేదు. ఎప్పటిలానే జాగృతి ప్రతినిధులే ఉన్నారు.