
కోరుట్ల, వెలుగు : టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడితే నెల నెలా లాభాలు ఇస్తామంటూ రూ. కోటి వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న దంపతులను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై చిరంజీవి వెల్లడించారు. కోరుట్లలోని కాల్వగడ్డ పటేల్ రోడ్డు కాలనీకి చెందిన మహ్మద్ గౌసొద్దీన్ వాజీద్, రహమతి బేగం భార్యాభర్తలు.
వీరు2023లో కోరుట్ల పట్టణానికి చెందిన సుమారు 50 మంది వద్ద రూ.1,10,40,000 అప్పు తీసుకున్నారు. ఈ డబ్బులతో టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడుతున్నామని, నెల నెలా లాభాలు పంచి ఇస్తామని నమ్మించారు. తర్వాత కొందరికి నెల నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వచ్చిన దంపతులు.. తర్వాత కనిపించకుండా పోయారు. డబ్బులు రాకపోవడం, వీరిద్దరూ కనిపించకపోవడంతో ఇటీవల పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల ఎంక్వైరీలో నిందితులిద్దరూ హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. దీంతో సోమవారం వారిని అరెస్ట్ చేసి కోరుట్లకు తీసుకొచ్చారు.