
పక్కా సర్వే నంబర్లతో 1200 గజాలు రిజిస్ట్రేషన్..?
భూదందాలో అధికార పార్టీ లీడర్హస్తం..
కబ్జా ల్యాండ్పై మాఫియా కన్ను
నర్సంపేట, వెలుగు : నర్సంపేట టౌన్ పరిధిలోని సర్వాపురం శివారు జాలు బంధం కాల్వ మాయమైంది. నాలాపై కన్నేసిన అధికార పార్టీ లీడర్ దర్జాగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పాకాల చెరువుకు ప్రధాన కాల్వల్లో ఒకటైన జాలు బంధం కాల్వ నర్సంపేట టౌన్ శివారు సర్వాపురం గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. సాగునీటి అవసరాల కోసం ఈ కాల్వను రైతులు ఉపయోగిస్తుంటారు. నర్సంపేట టౌన్ మీదుగా 365 నేషనల్హైవే వెళుతోంది. ఈ హైవే పక్కన భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కబ్జాకోరుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది. 2021 ఏప్రిల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు జాలు బంధం కాల్వను కబ్జా చేశాడు. ఆ టైంలో ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సాల్మాన్, తహసీల్దార్ రాంమూర్తి, సర్వేయర్ దశరథ్లతో పాటు పలువురు ఆఫీసర్లు జాలుబంధం కాల్వను పరిశీలించారు. ఈ విషయంలో సదరు లీడర్ ‘ఊరికి నేనే బాస్.. అంతా నా ఇష్టం’ అంటూ మాట్లాడటంతో ఆఫీసర్లు విస్తుపోయారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనపై రూలింగ్పార్టీ టాప్ లీడర్చక్రం తిప్పడంతో కేసు ఫైల్ కాలేదు.
1200 గజాల రిజిస్ర్టేషన్...?
సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ జాలుబంధం కాల్వను ఏకంగా ప్లాట్లుగా కాగితాలపై మలిచి రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. కాల్వ పక్కనే ఉన్న ఓ పట్టాదారుడితో మాట్లాడుకుని అతనికి చెందిన సర్వే నంబర్లతో ప్లాట్లుగా రిజిస్ర్టేయిన్ చేయించుకోవడం టౌన్లో హాట్టాపిక్గా మారింది. సుమారు 420 ఫీట్లు వెడల్పు, 30 ఫీట్ల లోతుతో ప్లాట్లుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. మార్కెట్లో ఈ ల్యాండ్ విలువ సుమారు రూ.కోటి 20 లక్షల వరకు ఉంటుంది. ఈ ల్యాండ్ను అమ్మి పెట్టాల్సిందిగా సదరు లీడర్రియల్ ఎస్టేట్ఏజెంట్లను కోరినట్లు సమాచారం.
రంగంలోకి ల్యాండ్ మాఫియా
లీడర్కబ్జా చేసిన జాలుబంధం కాల్వపై ల్యాండ్ మాఫియా కన్నేసింది. 1200 గజాల స్థలాన్ని కారు చౌకగా కొనేందుకు పలు దఫాలుగా చర్చలు జరిపారు. కుల్గుత్తాగా ఈ ల్యాండ్ను ల్యాండ్ మాఫియా ముఠా మాట్లాడుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు గతేడాది జాలుబంధం కబ్జాకు గురైనప్పుడు ఉన్న ఆఫీసర్లే ఇప్పుడూ ఉన్నారు. వారిప్పుడు ఏం చేస్తారోనని పట్టణవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.