IND vs ENG, 2nd Test: ఇంగ్లాండ్ వెన్ను విరిచిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డ్

IND vs ENG, 2nd Test: ఇంగ్లాండ్ వెన్ను విరిచిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డ్

భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతుంటే స్పిన్నర్లు చెలరేగుతారని అందరికీ తెలిసిందే. స్పిన్ పిచ్ లను తయారు చేసి ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం మన జట్టుకు అలవాటే. అందుకే మన గడ్డపై స్పిన్ ఆడాలంటే ప్రత్యర్థి జట్టు మ్యాచ్ కు ముందే భయపడతారు. అనీల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ నుంచి ప్రస్తుతం అశ్విన్, జడేజా వరకు ఎంతోమంది విదేశీ బ్యాటర్లకు భారత స్పిన్నర్లు పీడకలలా మారారు. రికార్డులు, చరిత్ర ఒకసారి గమనిస్తే స్వదేశంలో ఒక ఫాస్ట్ బౌలర్ 5 వికెట్లు తీసుకోవడం చాలా అరుదు. దాదాపు 80 నుంచి 90 శాతం వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోనే వెళ్లిపోతాయి.

ప్రస్తుతం భారత పర్యటనలో ఇంగ్లాండ్ స్పిన్నర్లపైనే దృష్టి పెట్టింది. అయితే వారికి స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. హైదరాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఈ పేస్ గుర్రం..తాజాగా వైజాగ్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. స్పిన్నర్లలకు అనూకూలించే భారత పిచ్ లపై బుమ్రా చెలరేగిన తీరు అత్యద్బుతమనే చెప్పాలి. ముఖ్యంగా పోప్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కు వేసిన యార్కర్ల ధాటికి స్టంప్స్ ఎగిరి పడ్డాయి. 

బుమ్రా వేసిన ఈ బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. వేస్తుంది బంతులా.. బుల్లెట్ల అనే అనుమానం కలగక మానదు. తొలి రెండు వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి వెళ్లగా.. తర్వాత 8 లో 6 వికెట్లు బుమ్రా తీయడం విశేషం. లంచ్ తర్వాత రూట్(5), పోప్(23) లను అవుట్ చేసిన ఈ గుజరాతీ వీరుడు.. లంచ్ తర్వాత మరింత రెచ్చిపోయి బెయిర్ స్టో(25), స్టోక్స్(47), అండర్సన్(6),హార్టీలి(21) వికెట్లను పడగొట్టాడు. నాలుగు వికెట్లు పూర్తి చేసుకున్న తర్వాత బుమ్రా టెస్టు కెరీర్ లో 150 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (6781) 150 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

బుమ్రా విజ్రంభనతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌటైంది. 76 పరుగులు చేసిన ఓపెనర్ క్రాలి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టోక్స్ 47 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ కు 3, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ లభించింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.