
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. రేపు జార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ జరగనుంది. రేపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. దీనిపై శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని, సభలో సీఎం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ కూడా సమావేశాలకు సిద్ధమవుతోంది.
కాగా, సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గు గనులను కేటాయించుకున్నారని ఈసీ నిర్ధారించింది. దీంతో సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కు సూచించింది. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం పై కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.