- జార్ఖండ్లో అరెస్టు చేశాం: సీబీఐ
- గుజరాత్లో విస్తృత సోదాలు
- నలుగురు నిందితులకు సీబీఐ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు
అహ్మదాబాద్: నీట్యూజీ–2024 పేపర్లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ జర్నలిస్టును జార్ఖండ్లోని హజారీబాగ్లో శనివారం అదుపులోకి తీసుకున్నది. ఓ హిందీ న్యూస్ పేపర్లో పనిచేసే జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కు సాయం చేశారనే అభియోగాలతో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంను కేంద్ర దర్యాప్తు సంస్థ శుక్రవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హజారీబాగ్లో నీట్ పరీక్ష నిర్వహణకు స్థానిక ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సానుల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలం ఎన్టీఏ అబ్జర్వర్, ఒయాసిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ కోఆర్డినేటర్గా వ్యవహరించారని సీబీఐ అధికారులు వెల్లడించారు.
గుజరాత్లో నలుగురికి సీబీఐ కస్టడీ
గుజరాత్లో అరెస్టయిన నలుగురు నిందితులకు పంచమహల్ కోర్టు శనివారం సీబీఐ కస్టడీ విధించింది. వీరిలో స్కూల్ టీచర్తుషార్ భట్, జై జలరామ్ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తంశర్మ, మధ్యవర్తులు విభోర్ ఆనంద్, ఆరిఫ్ వోహ్రాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ, తాజా దర్యాప్తు కోసం తమ కస్టడీ అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది ధ్రువ్ మాలిక్ కోర్టుకు తెలిపారు. దీంతో నలుగురిని జులై 2 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ పంచమహల్ కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సీకే చౌహాన్ తీర్పు చెప్పారు. కాగా, శనివారం సీబీఐ బృందాలు గుజరాత్లోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
