వలసలతో జార్ఖండ్​ కబ్జా

వలసలతో జార్ఖండ్​ కబ్జా

జార్ఖండ్​ అసెంబ్లీకి ఇంకా అయిదారు నెలల గడువుంది. మొన్నటి జనరల్​ ఎలక్షన్స్​లో బీజేపీ మొత్తం 14 ఎంపీ స్థానాల్లో 12 గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే, ఎస్టీలకు రిజర్వు చేసిన అయిదు సీట్లలో ఓట్ల చీలిక బాగా జరిగింది. దీనికి కారణం ఆదివాసీ ప్రాంతాల్లోకి బయటి జనాలు వెల్లువెత్తడమే! ఇప్పుడు ఆదివాసీలకు, జార్ఖండ్​లోకి వచ్చి చేరుతున్న ఇతర ప్రాంతాలవారికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఒకరకంగా ఇక్కడి సహజ వనరులపైనా, అటవీ భూములపైనా గిరిజనేతరుల కబ్జా సాగుతోంది. అందుకే, జార్ఖండ్​ సాధనోద్యమంలో పనిచేసిన జేఎంఎం, జేవిఎం వంటి పార్టీలు ‘బ్యాక్​ టు బేసిక్స్​’ అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలనాటికి జార్ఖండ్​లో ట్రైబల్​ రైట్స్​ ప్రాతిపదికన అజెండా ఖరారు చేయనున్నాయి.

జార్ఖండ్​లోని ట్రైబల్​ పాలిటిక్స్​ గురించి చర్చించాలంటే ముందుగా అక్కడి రిజర్వ్​డ్​ స్థానాల గురించి మాట్లాడుకోవాలి. ఆ రాష్ట్రంలో ఐదు ఎస్టీ రిజర్వుడ్​ సీట్లు సహా మొత్తం 14 లోక్​సభ సీట్లు ఉండగా, వాటిలో 12 బీజేపీ దక్కించుకుంది. ఎస్టీలకు రిజర్వ్ ​చేసిన ఐదు సెగ్మెంట్లలో మూడు బీజేపీ గెలవగా. రెండుచోట్ల కాంగ్రెస్​ క్యాండిడేట్లు విజయం సాధించారు. ఈ రెండు మాత్రమే కాంగ్రెస్​కి దక్కిన సీట్లు. కమలదళం సొంతం చేసుకున్న మూడు స్థానాల్లో ఒకటి సంథాల్​ పర​గణా రీజియన్​కి,​ మరో రెండు సీట్లు ఛోటా నాగ్​పూర్​ ప్రాంతానికి చెందినవి. ఛోటా నాగ్​పూర్​లో బీజేపీ కైవసం చేసుకున్న రెండు సెగ్మెంట్లలో ఆ పార్టీ పొందిన మెజారిటీ చాలా తక్కువ. ముఖ్యంగా ఖుంతి నియోజకవర్గంలో పథల్​గఢి మూమెంట్​ ప్రభావంతో బీజేపీ క్యాండిడేట్లు నామమాత్రపు ఆధిక్యతను  మాత్రమే (కేవలం 3,000 ఓట్లు) పొందగలిగారు. ఇక్కడ బీజేపీకి 45.97 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్​ పార్టీ ఖాతాలో 45.80 శాతం పడ్డాయి.

ఈ రెండు పార్టీల అభ్యర్థులతోపాటు మరో తొమ్మిది మంది క్యాండిడేట్లు కూడా అక్కడ బరిలో నిలిచారు.వీళ్లవల్ల ఓట్ల చీలిక బాగా జరిగింది. 1,864 ఓట్ల నుంచి 10,989 వరకు ఇతర క్యాండిడేట్లు చీల్చగలిగారు. లోహర్​దగా సెగ్మెంట్​లోనూ బీజేపీది ఇదే పరిస్థితి. అక్కడ కమలదళానికి 45.45 శాతం మంది ఓటేయగా, హస్తం పార్టీకి ఒన్​ పర్సెంట్​ కన్నా తక్కువగా 44.18 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ నియోజకవర్గంలోకూడా ఇతరులు 12 మంది వరకు పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చారు. ఇక్కడ ఈ క్యాండిడేట్లు తక్కువలో తక్కువగా 1,889 ఓట్ల నుంచి 10,989 వరకు ఓట్లు రాబట్టుకున్నారు. ఈ రెండు చోట్ల గ్రామీణ స్థాయిలో జరుగుతున్న ఉద్యమాలు బీజేపీకి భిన్నమైన అనుభవాన్ని, ఫలితాన్ని మిగిల్చాయి. ఒక రకంగా చెప్పాలంటే కమలనాథులకు చావు తప్పి కన్ను లొట్టబోయింది.

తగ్గుతున్న గిరిజనులు.. దూరమవుతున్న హక్కులు

ఈ సమస్యకు కారణం బయటకు కనిపిస్తున్నప్పటికీ, సమస్య తీవ్రతమాత్రం చాలా లోతైనది. జార్ఖండ్​లోకి ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారు. దీంతో  ట్రైబల్​ జనాభా తగ్గుముఖం పడుతోంది. ఎస్టీలకు రిజర్వ్​ చేసిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరస్థితి. ఇక్కడే పుట్టి పెరిగినవారికి భూములు, వనరులు, స్వయం పాలనకు సంబంధించి రాజ్యాంగపరంగా, లీగల్​గా దక్కాల్సిన హక్కులు ఏవీ దక్కడం లేదు. బయటి ప్రాంతాల ప్రజలు వచ్చి చేరడంవల్ల తమకు కేంద్ర, రాష్ట్రాలనుంచి డెవలప్​మెంట్​ స్కీమ్​లు దూరమవుతున్నాయనే బాధ వారిలో గూడు కట్టుకుంది. వాటి సాధనకోసం పోరు బాట పట్టాల్సి వస్తోంది.

దీనికితోడు ఇక్కడి ట్రైబల్​ క్రిస్టియన్లు, ట్రైబల్ వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నెలకొన్నాయి. ట్రైబల్​ జాతులు బీజేపీకి సపోర్ట్​గా ఉంటున్నాయి. ఫలితంగా చర్చిలపైన, ట్రైబల్​ క్రీస్టియన్లపైన నిరాటంకంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు వర్గాలకు 1960వ దశాబ్దం మధ్య నుంచే గొడవలు జరుగుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సోషల్​, కల్చరల్ అంశాలు ఉన్నాయి. రాజకీయాలు కూడా ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయనే వాదనా వినిపిస్తోంది.  .  జార్ఖండ్​ పాలిటిక్స్​ ఎక్కువ శాతం ట్రైబల్​ క్రీస్టియన్లకు ఎస్టీ స్టేటస్​ ఇవ్వొద్దనే అంశం చుట్టూనే తిరుగుతాయి. చదువులు, రిజర్వేషన్లు వంటి విషయాల్లో ట్రైబల్​ క్రీస్టియన్లు ముందంజలో ఉన్నారు. ట్రైబల్​ జాతులు చాలా వెనకబడ్డాయి. స్టేట్​, సెంట్రల్​ సర్వీసుల్లో ట్రైబల్​ క్రీస్టియన్ల హవా కొనసాగుతోంది. దీంతో వాళ్లను ఎస్టీలుగా గుర్తించొద్దనే డిమాండ్​ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీన్నే ఇప్పుడు సంఘ్​ పరివార్​, దాని అనుబంధ సంస్థలు ప్రధాన అజెండాగా మలచుకున్నాయి.

కొత్త ఉద్యమానికి సోరేన్​ సైరన్​

అసెంబ్లీ సమరానికి జార్ఖండ్​లో రెండో ప్రధాన పార్టీ అయిన జార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం) కసరత్తు మొదలుపెట్టింది. జేఎంఎం ఎగ్జిక్యూటివ్​ చైర్మన్, మాజీ సీఎం హేమంత్​ సోరెన్ పార్టీకి దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఇతర పార్టీలతో పొత్తుల దిశగా కూడా ఆలోచనలు జరిపినట్లు తెలిపారు.  జార్ఖండ్​లో తమ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందన్న ఆవేదన హేమంత్​లో ఉంది., జార్ఖండ్​ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన తండ్రి శిబూ సోరెన్​ పాత్ర కీలకమైంది. వడ్డీ వ్యాపారుల కోరల నుంచి ఆదివాసీల హక్కుల పరిరక్షణలో శిబూ సోరెన్​ బాగా శ్రమించారు. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక శిబూకి ఛాన్స్​ దక్కలేదు.  2005లో సీఎం కాగలిగారు. మొత్తంగా మూడుసార్లు శిబూ సీఎంగా పనిచేసినా 300 రోజులు పూర్తి చేయలేకపోయారు. అలాగే, హేమంత్​ సోరేన్​ ఏడాదిన్నర కాలమే జార్ఖండ్​ సీఎంగా ఉన్నారు.

బీజేపీ అజెండా ఫిక్స్​

200‌‌‌‌0లో జార్ఖండ్​ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మొదటి 14 ఏళ్లలో 9 సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయిదుగురు నాయకులే సీఎంలుగా పనిచేశారు. అర్జున్​ ముండా, శిబూ సోరేన్​ మూడేసిమార్లు; బాబూలాల్​ మరాండీ, మధు కోడా, హేమంత్​ సోరేన్​ ఒక్కొక్కసారి  ప్రభుత్వాన్నేర్పాటు చేశారు. ఈ తొమ్మిది ప్రభుత్వాల్లోనూ బీజేపీయే కీలక పాత్ర పోషించింది. అయితే, 2014లో జార్ఖండ్​లోని 81సీట్లకుగాను 48 సీట్లు గెలిచి బీజేపీ సింగిల్​గా అధికారంలోకి వచ్చింది. రఘువర్​ దాస్​ సీఎంగా అయిదేళ్లు గడిచిపోయాయి. జనరల్​ ఎలక్షన్స్​లో 12 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఉత్సాహంలో ఈసారి అసెంబ్లీలో 65 సీట్లు దక్కించుకోవాలని బీజేపీ అజెండా ఫిక్స్ చేసుకుంది.