అయోధ్య నిర్మాణం కోసం 30 ఏండ్ల మౌన పోరాటం

అయోధ్య నిర్మాణం కోసం 30 ఏండ్ల మౌన పోరాటం

సరస్వతి దేవీ అగర్వాల్ వయసు ఎనభై ఏండ్లు. జార్ఖండ్​లోని ధన్​బాద్​ పరిధిలోని కరమ్​ తాండ్​ ఆమె నివాసం. రాముడంటే ఆమెకి అమితమైన భక్తి. ఈమె భర్త దేవ్​కీ నందన్​. వీళ్లకు ముగ్గురు సంతానం. సరస్వతి చదువుకోలేదు. పెండ్లయ్యాక భర్త దేవ్​కీ నందన్​ ఆమెకి చదవడం, రాయడం నేర్పించాడు. దానివల్ల ‘రామ్​ చరిత్ మానస్’​తోపాటు ఇతర గ్రంథాలు చదవగలిగింది ఆమె. మొదటిసారి1992, మేలో భర్తతో కలిసి అయోధ్యకు వెళ్లింది. 

అక్కడ రామజన్మ భూమి ట్రస్ట్​ అధినేత మహంత్ నృత్య గోపాల్​ దాస్​ను కలిసిందామె. ఆయన స్ఫూర్తితో మౌనవ్రతం మొదలుపెట్టింది. రామాలయం పూర్తయ్యే వరకు మౌనవ్రతం చేయాలి అని నిర్ణయించుకుంది. అందుకు ఆమె పిల్లలు కూడా సహకరించారు. ఆమె రోజులో ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటుంది. ఏదైనా చెప్పాలంటే పెన్ను, పేపర్​ మీద రాస్తుంది. ఇంట్లో వాళ్లతో సైగలతో మాట్లాడుతుంది. అయితే 30 ఏండ్ల తర్వాత ఆమె కల నెరవేరింది. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందింది. 

మహంత్ గోపాల్​ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్​ ఆమెకు అయోధ్యలో స్వాగతం పలికారు. జనవరి 22న ‘రామ్​.. సీతారామ్​’ అంటూ మౌనవ్రతాన్ని విరమించబోతోంది. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో నా జీవితం ధన్యమైంది. ఇకపై అయోధ్యలోని మహంత్ గోపాల్​ దాస్ ఆశ్రమానికి వెళ్లి, అక్కడే ఉండాలి అనుకుంటున్నా’ అని తన మనసులోని ఆలోచనలను పేపర్​ మీద రాసి చూపించింది.