ప్రధాన నగరాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

ప్రధాన నగరాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

జియో కస్టమర్లకు శుభవార్త. ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ తర్వాత క్రమంగా 2023 డిసెంబర్ వరకు దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, జిల్లాలు, మండలాలకు జియో 5జీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. 

 5జీపై రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ మెటావర్స్ టెక్నాలజీ ద్వారా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ..జియో 5జీ సేవలపై ప్రకటన చేశారు. Jio స్టాండలోన్ 5G అని పిలువబడే 5G యొక్క తాజా వెర్షన్‌ను అమలు చేస్తుందని చెప్పారు. 5జీ మౌలిక సదుపాయాలపై రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు.

బిడ్డింగ్లో జియో అగ్రస్థానం..
కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన 5జీ వేలం పాటలో ప్రభుత్వానికి సుమారు రూ. 1.5 లక్షల బిడ్లు వచ్చాయి. 5G స్పెక్ట్రమ్ వేలం బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz,26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. అటు దేశ వ్యాప్తంగా అక్టోబర్ నాటికి 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు.