27 వేల కోట్లు అప్పు తీసుకుంటున్న జియో ఫైబర్‌

27 వేల కోట్లు అప్పు తీసుకుంటున్న జియో ఫైబర్‌

ముంబై: రిలయన్స్‌‌ జియో ఇన్ఫోకామ్‌ లో భాగమైన ఫైబర్‌ నెట్‌‌వర్క్‌‌ యూనిట్‌‌ వివిధ బ్యాంకుల నుంచి రూ.27 వేల కోట్లను అప్పుగా తీసుకుంటోంది. విద్యుత్‌ ,టెలికం, ఇంటర్‌ నెట్‌‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి వచ్చే డిమాండ్‌ ను తట్టుకునేందుకు అనువుగా ఈ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టును విస్తరించాలని రిలయన్స్‌‌ జియో ఇన్ఫోకామ్‌ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిం చాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, పంజాబ్‌ నేషనల్‌‌ బ్యాంక్‌ (పీఎన్‌ బీ), స్టేట్‌‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ బీఐ)ల నుంచి ఆ మొత్తాన్ని రుణంగా కంపెనీ తీసుకోనుంది.

మార్చి 2019 నాటికి 30 కోట్ల కస్టమర్ల మార్కు దాటిన జియో తన ఫైబర్‌ , టవర్‌ వ్యాపారాలను రెండు ప్రత్యేక యూనిట్లుగా జియో డిజిటల్‌‌ ఫైబర్‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌ , రిలయన్స్‌‌ జియో ఇన్‌ ఫ్రాటెల్‌‌  ప్రైవేట్‌‌ లిమిటెడ్‌ పేరిట డీమెర్జ్‌ చేసింది. వీటిలో జియో డిజిటల్‌‌ ఫైబర్ కోసం ప్రత్యేక క్రెడిట్‌‌లైన్‌ కావాలని జియో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల మెచ్యూరిటీ గడువుండే ఈ రుణాలపై వడ్డీ రేటు 8.35–8.85 శాతం మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.

డీమెర్జర్‌  ప్రాసెస్‌ కోసమే ప్రధానంగా ఈ రుణం అవసరమవుతున్నట్లు చెబుతున్నారు . దాంతో ఫైబర్‌ వాణిజ్యం స్టాండ్‌ అలోన్‌ సబ్సిడరీగా అవతరిస్తుందని ఆ వర్గా లు తెలిపాయి. ఫైబర్‌ వాణిజ్యాన్నిపటిష్ట పరిచేందుకు ఈ రుణ నిధులను కంపెనీ వినియోగించనుందని పరిశ్రమలో సీనియర్‌ ఎనలిస్ట్‌‌ ఒకరు తెలిపారు. ఇతర కంపెనీలు, వ్యాపారాల నుంచి యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ చర్య సాయపడుతుందని పేర్కొన్నారు . ఇతర టెలికంప్లేయర్లతో పాటు,విద్యుత్‌ రంగంలోని కంపెనీలూ ఈ ఫైబర్‌ నెట్‌‌వర్క్‌‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

స్మార్ట్‌‌ఫోన్‌ ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో డేటా వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యం రిలయన్స్‌‌ జియో ఇన్ఫోకామ్‌ కు మంచి అవకాశంగా అందివచ్చిందని ఫిబ్రవరిలో ఒక రిపోర్టులో క్రిసిల్ అభిప్రాయపడిం ది. అనేక కంటెంట్‌‌ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేయడంతోపాటు, ఫైబర్‌ టు ది హోమ్‌ (ఎఫ్‌‌టీటీహెచ్)రంగంలోకీ జియో అడుగుపెట్టింది. డెన్‌నెట్‌‌వర్క్స్‌ లిమిటెడ్‌ , హాథ్‌ వే కేబుల్స్‌‌ అండ్‌ డేటాకామ్‌ లిమిటెడ్‌ లను రెండింటినీ కొనుగోలు చేసిం దికూడా.

ఎస్‌‌బీఐ రూ. 11 వేల కోట్లు అప్పు..

రుణాలలో ఒక్క ఎస్‌ బీఐనే రూ. 10 వేల కోట్ల నుంచి 11 వేల కోట్లను సమకూరుస్తుండగా, ఐసీఐసీఐ, పీఎన్‌ బీలు చెరో రూ. 5 వేల కోట్లను , యాక్సిస్‌ బ్యాం క్‌ రూ. 6 వేల కోట్లను అప్పుగా జియో ఫైబర్‌ ప్రాజెక్టుకు ఇవ్వనున్నాయి. వేల కోట్ల రూపాయల రుణాలు ఎన్‌ పీఏలుగా మారడంతో ఇబ్బందులలో పడిన బ్యాంకిం గ్‌ పరిశ్రమకు ఈ తాజా రుణ ప్రతిపాదన కొంత మెరుగైన అవకాశమవుతుందని అంచనా వేస్తున్నారు . ఐతే, రిలయన్స్‌‌ గ్రూప్‌‌ ఈ పరిణామాలపై స్పందించలేదు. అప్పులిస్తున్న బ్యాంకులూ ఈమెయిల్స్‌‌కు ఇంకా సమాధానమివ్వలేదు. ఫైబర్‌ , టవర్‌ వాణిజ్యాలను ప్రత్యేక కంపెనీలుగా డీమెర్జర్‌ చేసేందుకు నెల రోజుల కిందటే రిలయన్స్‌‌ జియోకు నేషనల్‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌ అనుమతి వచ్చింది. భారతి ఎయిర్‌ టెల్‌‌, వోడాఫోన్‌ ఐడియాలు కూడా తమ ఫైబర్‌ వ్యాపారాన్ని ఇప్పటికే వేరుచేయడమో లేదా చేసే ప్రయత్నాలలోనో ఉన్నా యి.