
పాలమూరు వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పదవులు లభిస్తాయని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు కుసుమకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో గురువారం ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈనెల 15లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పు ఉంటుందన్నారు. ఒక్కో అసెంబ్లీ నుంచి ఒక ఉపాధ్యక్షుడిన్ని, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను, మండలం నుంచి ఒక కార్యదర్శిని నియమిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమర్థ పాలన అందిస్తున్నారని కొనియాడారు.
50శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా పదవులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శులు సంజీవ్ మదిరాజ్, మిథున్ రెడ్డి, లీడర్లు ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా ఇన్చార్జి సమావేశం నిర్వహించారు.