
రావాలని ఉన్నా…రానిస్తలేరు
కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తెస్తేనే జర్నీకి పర్మిషన్ ఇస్తామంటున్న అధికారులు
లక్షణాలు లేవని టెస్టులు చేయని హాస్పిటల్స్
వీడియో తీసి కేటీఆర్కు ట్వీట్
విదేశాంగ మంత్రి, ఇటలీలోని ఇండియన్ ఎంబసీకి రీట్వీట్ చేసిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఆ దేశం నుంచి ఇండియా రావడానికి మిలాన్ ఎయిర్పోర్టుకు వచ్చి చిక్కుకుపోయిన ఇండియన్స్ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రోమ్-–ఫిమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోనూ ఇండియన్ స్టూడెంట్స్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. కరోనా ఫ్రీ సర్టిఫికెట్ లేదన్న కారణంతో అనుమతించకపోవడంతో ఎయిర్పోర్టులోనే కష్టాలు పడుతున్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పిన ఇండియన్ ఎంబసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన స్టూడెంట్స్ వీడియో తీశారు. దీనిని వారితోనే ఉన్న తెలంగాణకు చెందిన రష్మి మయూర్ కొయ్యాడ ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం రోమ్ ఎయిర్పోర్టులో తెలంగాణ, ఏపీకు చెందిన స్టూడెంట్స్ తోపాటు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది వరకు ఉన్నాం. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. వైరస్ లక్షణాలు లేకపోతే టెస్టులు చేయబోమని డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ మా పరిస్థితి అర్థం చేసుకోండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సాయం చేయాలి’ అని అందులో కోరారు.
స్పందించిన కేటీఆర్
రోమ్ ఎయిర్పోర్టులో తీసిన వీడియోను కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ రష్మి మయూర్ కొయ్యాడ ట్వీట్ చేయడంతో ఆయన స్పందించారు. దానిని రీ ట్వీట్ చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు, ఇటలీలోని ఇండియన్ ఎంబసీకి ట్యాగ్ చేశారు. దయచేసి ఇటలీలోని రోమ్లో చిక్కుకుపోయిన తెలంగాణ వారిని, ఇతర ఇండియన్స్ కు సాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి జయశంకర్ను అభ్యర్థించారు. ఇటలీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించి స్టూడెంట్స్ కు అవసరమైన సహాయం చేయాలని ట్విటర్లో కేటీఆర్ కోరారు.
మిలాన్ ఎయిర్పోర్టులోనే 30 మంది…
కరోనా ఫ్రీ సర్టిఫికెట్లేక మిలాన్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన 200 మంది స్టూడెంట్స్లో సగానికి పైగా స్నేహితులు, బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు. ఎయిర్పోర్టులో ఇంకా 30 మంది వరకు వెయిట్ చేస్తున్నారు. కనీసం ఫుడ్ కూడా లేదని, ఎయిర్ పోర్టు అధికారులు బోర్డింగ్ పాస్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. బోర్డింగ్ పాస్ ఇయ్యాలంటే కొవిడ్-19 నెగటివ్ సర్టిఫికెట్ కావాలంటున్నారని, కానీ అక్కడి హాస్పిటల్స్ లోని డాక్టర్లు మాత్రం కేవలం వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారని, మిగతా వారిని కనీసం హాస్పిటల్స్ లోకి కూడా రానివ్వడం లేదంటున్నారు.
టూరిస్టుల కష్టాలు
ఇరాక్, ఇరాన్లోని షియా పవిత్ర స్థలాలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఫిబ్రవరి రెండో వారంలో 100 మంది టూరిస్టులు వెళ్లారు. ఇరాక్లో లాక్డౌన్ విధించడంతో కష్టాలు పడుతున్నామని తెలంగాణ, ఏపీ షియా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ తెలిపారు. వీరిలో షియా మతగురువు మౌలానా అహ్మదీ జైదీతోపాటు ప్రముఖ కవి మౌసిన్ అలీ కూడా ఉన్నారన్నారు. ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియాతోపాటు పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయన్నారు.
For More News..