- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరం
- మరోసారి పోటీకి సై అంటున్న సీనియర్లీడర్
కామారెడ్డి, వెలుగు : ఆయన తక్కువ కులం వాడని హోటల్లో చాయ్పోసేందుకు నిరాకరించారు. తన గోడు కలెక్టర్కు చెప్పుకుందామని పోతే, పోలీసులు ఎత్తి బయటపడేశారు. అయితే ఈ ఘటనతో ఆయన కుంగిపోలేదు. ఎక్కడ తనను తక్కువ చేసి చూశారో, అక్కడే తల ఎత్తుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలతో ఏడాది తిరిగేలోగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరెవరో కాదు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్గంగారాం. ఈయనది నియోజకవర్గంలోని చిన్నకొడప్గల్. ఊరిలో చెప్పులు కుట్టుకుంటూ జీవించేవారు. 1976లో తనకు 23 ఏండ్లు ఉన్నప్పుడు ఊరిలోని ఓ హోటల్లో చాయ్తాగేందుకు వెళ్లారు.
Also Raed : పోలవరం అఫిడవిట్లో అన్నీ తప్పులే : సీడబ్ల్యూసీ, పీపీఏలకు తెలంగాణ లేఖ
అయితే సెపరేట్గ్లాస్లేదని, చాయ్పొయ్యమని హోటల్ వాళ్లు చెప్పారు. దీంతో కలత చెందిన గంగారాం.. నాటి నిజామాబాద్కలెక్టర్ ఆనంద్కుమార్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వెళ్లారు. కలెక్టర్ను కలిసేందుకు చాంబర్ముందు కూర్చోగా, పోలీసులు వచ్చి గంగారాంను ఈడ్చుకెళ్లి ఆఫీసు బయటపడేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పినప్పటికీ, కలెక్టర్ను కలిసే అవకాశం కల్పించలేదు. తాను అనామకుడు కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించిన గంగారాం.. ఎలాగైనా లీడర్కావాలని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని.. అప్పుడు గెలిచినా, ఓడినా తాను పాపులర్అవుతానని భావించారు. దీనికితోడు జుక్కల్ఎస్సీ నియోజకవర్గం కావడం కూడా ఆయనకు కలిసొచ్చింది.
లాయర్ గోపాల్ రావు సాయంతో..
కలెక్టరేట్ నుంచి ఇంటికొచ్చిన గంగారాం.. ఊరిలోని కులకర్ణి గోపాల్రావు అనే వకీల్ను కలిసి తన పరిస్థితి చెప్పుకున్నారు. గోపాల్రావు, పీవీ నర్సింహారావు క్లాస్మేట్స్. వీరిద్దరికీ మహారాష్ర్టకు చెందిన కాంగ్రెస్నేత శంకర్రావు చౌహాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గంగారాం పట్టుదలను గమనించిన గోపాల్రావు.. ఆయనను మహారాష్ట్ర తీసుకెళ్లి శంకర్రావు చౌహాన్ను కలిపించారు. ఢిల్లీస్థాయిలో పలుకుబడి ఉన్న చౌహాన్.. ఇందిరా కాంగ్రెస్తరఫున గంగారాంకు జుక్కల్టికెట్ఇప్పించారు. అలా 1978లో జుక్కల్అసెంబ్లీ బరిలోకి దిగిన గంగారాం.. ఆలిండియా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఈశ్వరీబాయిపై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. చెప్పులు కుట్టుకునే ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తర్వాత 1983, 1989, 2004 ఎన్నికల్లోనూ గంగారం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో మాత్రం బీఆర్ఎస్అభ్యర్థి హన్మంతుషిండే చేతిలో ఓడిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు గంగారాం సిద్ధమయ్యారు.