కేబినెట్ భేటి: కీలక విచారణలు కొలిక్కి.. మంత్రివర్గ నిర్ణయంపై ఉత్కంఠ!

కేబినెట్ భేటి:  కీలక విచారణలు కొలిక్కి.. మంత్రివర్గ నిర్ణయంపై ఉత్కంఠ!
  • కాళేశ్వరం విజిలెన్స్​ రిపోర్ట్​పై నేడు మంత్రివర్గ భేటీలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​
  • పవర్ కమిషన్​ రిపోర్ట్​, ఫోన్​ట్యాపింగ్​, ఇతర ఎంక్వైరీలపైనా చర్చించే చాన్స్​
  • ఉద్యోగుల బదిలీలకు గ్రీన్​ సిగ్నల్.. ఒకటి లేదా రెండు డీఏలపై ప్రకటన?
  • రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల లిస్టులపైనా క్లారిటీ!
  • వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపైనా నిర్ణయాలు ఉండే అవకాశం

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ​కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్​ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్​, జీఎస్టీ, భూదాన్​భూముల దందా, గొర్రెల స్కీం లాంటి స్కాముల సంగతి తేల్చాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే పవర్​ కమిషన్​, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలన్నీ తుదిదశకు చేరిన నేపథ్యంలో గురువారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ ​భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతున్నది. 

ముఖ్యంగా కాళేశ్వరం విజిలెన్స్​ రిపోర్ట్​పై మంత్రివర్గ సమావేశంలో పవర్​పాయింట్ ప్రజెంటేషన్​ఇచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. ఈ అంశాలతోపాటు  ప్రజాసంక్షేమానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం సీజన్ సన్నద్ధత, రైతు భరోసా పంపిణీ, ఉద్యోగుల డిమాండ్లపైనా కేబినెట్​లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. 

చర్యలకు సిఫార్సు చేసిన కమిషన్లు

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అనేక అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు ఇటీవల రాష్ట్ర సర్కారుకు సమర్పించిన విజిలెన్స్ కమిషన్ నివేదిక వెల్లడించింది. దీంతో పాటు  నేషనల్​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) రిపోర్ట్​కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలోని లోపాలను పేర్కొంది.  ప్రధానంగా ఏడో బ్లాక్​ను పూర్తిగా తొలగించి నిర్మించాలని స్పష్టంచేసింది. 

బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయని తేల్చిన విజిలెన్స్​రిపోర్ట్.. ఇందుకు బాధ్యులైన నిర్మాణ సంస్థ ఎల్​అండ్​టీతోపాటు పలువురు ఇంజనీర్లపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. సాగునీటి శాఖకు చెందిన 17 మంది ఇంజినీర్లను ఐపీసీలోని సెక్షన్‌‌–120(బీ), 336, 409, 418, 423, 426తోపాటు పీసీ యాక్ట్‌‌–1988, ఆనకట్టల భద్రత చట్టం–2021, పీడీపీపీ చట్టం–1984ప్రకారం క్రిమినల్‌‌ కేసులు పెట్టాలని సూచించింది.  

వీరిలో పదవీ విరమణ చేసిన ఈఎన్‌‌సీ(జనరల్‌‌) సి.మురళీధర్‌‌, మాజీ ఈఎన్‌‌సీ(ఓ అండ్‌‌ ఎం) భూపతి రాజు నాగేంద్రరావు, రామగుండం మాజీ ఈఎన్‌‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఆర్థిక శాఖకు చెందిన డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ వర్క్స్‌‌ అకౌంట్స్‌‌ వి.ఫణి భూషణ్‌‌శర్మ, మాజీ ఈఎన్‌‌సీ (సీడీవో) ఎ.నరేందర్‌‌రెడ్డి, మాజీ సీఈ కె.ఎస్‌‌.ఎస్‌‌.చంద్రశేఖర్‌‌, ప్రస్తుత ఈఎన్‌‌సీ(ఓఅండ్‌‌ఎం) టి.శ్రీనివాస్‌‌ సహా 17 మంది ఉన్నారు.  టీసీఎస్‌‌–1991 రూల్‌‌–24 ప్రకారం పదవీ విరమణ చేసిన వారితో పాటు సర్వీసులో ఉన్న 33 మందిపై అభియోగాలు నమోదు చేయాలని స్పష్టంచేసింది. వీరిలో పదవీవిరమణ చేసిన వారిని మినహాయిస్తే మిగిలినవారంతా ప్రస్తుతం ఇరిగేషన్​శాఖలో కీలక స్థానాల్లో ఉన్నారు. అందరిపై ఒకేసారి చర్యలు తీసుకుంటే సాగునీటి శాఖ కుప్పకూలే ప్రమాదముంది. దీంతో ఆయా ఇంజనీర్ల విషయంలో కేబినెట్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?  కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఏమి తేలుస్తుంది? రిపేర్లు, పునర్నిర్మాణం,  నిర్వహణపై ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 

 గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై, ముఖ్యంగా చత్తీస్‌‌గఢ్ పీపీఏపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  ఈ అంశంపై ఇప్పటికే కమిషన్  వేయగా.. సంబంధిత వర్గాలను విచారించి, సర్కారుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం,  భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనా కేబినెట్​ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

 సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా కీలక దశకు చేరుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన ప్రభాకర్ రావు సిట్​విచారణ ఎదుర్కొనేందుకు స్వదేశానికి తిరిగి రాబోతుండడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. ఆయన ద్వారా నాటి ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశమున్నట్లూ తెలుస్తున్నది. 

 ఫార్ములా ఈ రేస్​, గొర్రెల పంపిణీ స్కీం, భూదాన్​భూములు తదితర స్కాముల విచారణలన్నీ కొలిక్కి వస్తున్నందున వీటిపై లీగల్​గా ఎలా ముందుకెళ్లాలి ? అనే వాటిపైనా కేబినెట్​ సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్క స్కామ్​లోనూ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఒకటి రెండు కేసుల్లోనైనా నిందితులను చట్టం ముందు నిలబెట్టడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ అధికారి వివరించారు.

కీలక పథకాలపై చర్చ!

ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల  ప్రకటనపై కేబినెట్​తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.  జూన్​ రెండో తేదీనే ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉండగా.. పలు కారణాలతో పక్కనపెట్టారు. పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్​ పంపిణీ చేస్తున్నప్పటికీ రాజీవ్​యువవికాసం లబ్ధిదారుల ప్రకటన నిలిచిపోయింది. ఇప్పటికే లబ్ధిదారుల లిస్టులను రెడీ చేసినప్పటికీ వారిలో సగానికి పైగా అనర్హులే ఉన్నారని ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలడంతో సీఎం ఆ లిస్టులను పక్కనపెట్టించారు. 

తాజాగా  కేబినెట్​లో చర్చించి, వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వడ్ల పైసలు, బోనస్​ చెల్లింపులు, వానాకాలం సీజన్ కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధతపై కేబినెట్​లో చర్చించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, సాగుకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. యాసంగి సీజన్​కు సంబంధించిన పెండింగ్​ రైతు భరోసాతోపాటు వానాకాలం రైతుభరోసా పంపిణీపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యతే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినెట్​ సబ్-కమిటీ సమావేశం కూడా జరిగింది. ఉద్యోగులు ఇప్పటికే తమ డిమాండ్లను సర్కారు ముందు ఉంచగా.. ఉద్యోగుల బదిలీలతోపాటు ఒకటి లేదా రెండు డీఏలపై కేబినెట్​ సమావేశంలో ప్రకటన ఉండొచ్చన్న చర్చ జరుగుతున్నది.