గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ సాయంతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేసి చెన్నైకి మకాం మార్చారు. తన పదవీకాలం అంతా సహకరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, ఎంహెచ్ఏ అధికారులు, అన్ని రాష్ట్రాల పోలీసు బలగాల అధిపతులకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయ్కుమార్.. కశ్మీర్లో బీఎస్ఎఫ్ ఐజీగా, చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2004లో వీరప్పన్ను మట్టుబెట్టడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చీఫ్గా పనిచేసి పక్కా ప్రణాళికతో వీరప్పన్ను అంతం చేశారు. విజయ్ కుమార్ 2019 నుంచి కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు.