ఏ గేమ్లోనైనా ఛాంపియన్ అవ్వాలంటే బెస్ట్ కోచ్ ఉండాలి. కానీ, వీళ్లు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండానే కబడ్డీలో అదరగొడుతున్నారు. పేద కుటుంబాలకి చెందిన వీళ్లకి కబడ్డీ ఆటంటే చాలా ఇష్టం. టీవీల్లో కబడ్డీ చూసి, ఏకలవ్య శిష్యుల్లా ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఆటలో స్కిల్స్ పెంచుకొని మండలం, జిల్లా స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్లలో అదరగొట్టారు. ఈమధ్యే నేషనల్ రూరల్ కబడ్డీ పోటీల్లో సత్తాచాటి, ఛాంపియన్గా నిలిచారు కూడా. అంతేకాదు ఇంటర్నేషనల్ పోటీల్లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నారు మెదక్ జిల్లాకి చెందిన మట్టిలో మాణిక్యాలు. వీళ్ల సక్సెస్ జర్నీ ఇది...
స్టేట్ లెవల్ కబడ్డీ పోటీల్లో గెలవాలంటే టెక్నిక్స్ తెలియాలి. అయితే, డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకునే స్థోమత లేదు వీళ్లకు. కోచ్ లేకపోతేనేం ఏకలవ్య శిష్యుల లెక్క టీవీలో ప్రొ– కబడ్డీ మ్యాచ్లు చూసి ఆటలో మెళకువలు నేర్చుకున్నారు. అల్లకుంట ప్రవీణ్, బండారి వంశీ గౌడ్, కార్తీక్ రెడ్డి, సంగెపు గణేష్, కరుణాకర్, చందు, రాకేష్ (వీళ్లది నిజాంపేట్ మండలంలోని చల్మెడ), గుగులోత్ అజయ్(రామాయంపేట మండలం పర్వతాపూర్ తండా), దండు రాజేందర్ (దామర చెర్వు), మేకల రాకేష్ (జాప్తి శివనూర్).... వీళ్లందరూ పేదింటి బిడ్డలే. మండలం, జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకి రెగ్యులర్గా వెళ్లేవాళ్లు. అక్కడే వీళ్లకి పరిచయం ఏర్పడింది. అందరి లక్ష్యం స్టేట్ లెవల్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం. దాంతో వీళ్లంతా కలిసి ఒక టీంగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి ఒకేచోట కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాళ్లు.
టర్నింగ్ పాయింట్
వీళ్ల ఆట గురించి రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్జీఎఫ్ఐ) ఉమ్మడి మెదక్ జిల్లా కోచ్ మల్లేశంకి తెలిసింది. పోయిన నవంబర్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్టేట్ లెవల్ కబడ్డీ మీట్ ఉందని వీళ్లకు చెప్పాడు. ఆ టోర్నమెంట్ వీళ్ల జీవితంలో టర్నింగ్పాయింట్. ఆ పోటీల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి, సెలక్టర్లని ఇంప్రెస్ చేశారు. దాంతో వీళ్ల టీమ్నే మన రాష్ట్రం నుంచి మహారాష్ట్రలో జరగనున్న నేషనల్ రూరల్ కబడ్డీ టోర్నమెంట్కు ఎంపికచేశారు. వీళ్లు ఎన్నో రోజులుగా కలలుగన్న అవకాశం రానే వచ్చింది. కానీ, మహారాష్ట్ర వెళ్లేందుకు వీళ్ల దగ్గర డబ్బులు లేకపోవడంతో, కొందరు దాతలు ఆర్థిక సాయం చేశారు.
నేషనల్ రూరల్ ఛాంపియన్షిప్
ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో నేషనల్ లెవల్ టోర్నమెంట్ జరిగింది. ఫైనల్లో మహారాష్ట్ర బి–టీంని 6 పాయింట్స్ తేడాతో ఓడించి, నేషనల్ రూరల్ కబడ్డీ చాంపియన్షిప్ గెలుచుకుంది మెదక్ టీం. అంతేకాదు టీం మెంబర్స్ అందరూ ఈ నెల 17, 18 తేదీల్లో నేపాల్లో జరగనున్న ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్కు సెలెక్ట్ అయ్యారు కూడా.
రోజూ 4 గంటల ప్రాక్టీస్
వీళ్లంతా చదువుకుంటూనే రోజూ కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాళ్లు. స్టేట్ లెవల్ కబడ్డీ టోర్నమెంట్కోసం పొద్దున, సాయంత్రం రెండు గంటల చొప్పున రోజూ నాలుగ్గంటలు ప్రాక్టీస్ చేశారు. హాలిడేస్లో రోజంతా కబడ్డీ ఆడేవాళ్లు. ‘వీళ్లకు చదువు మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఎప్పుడూ కబడ్డీ ఆడుతూనే ఉంటారు. కబడ్డీ ఆడి వీళ్లేం సాధిస్తారు?’ అని తల్లిదండ్రులు, గ్రామస్తులు అనే వాళ్లు. ఎవరెన్ని మాటలు అన్నా అవేమీ పట్టించు కోకుండా ప్రాక్టీస్ మీదే దృష్టి పెట్టారు. అలా వాళ్ల కష్టానికి నేషనల్ ఛాంపియన్షిప్తో గుర్తింపు వచ్చింది.
ప్రొ–కబడ్డీ లీగ్లో ఆడాలని ఉంది
చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఇంట్రెస్ట్. కబడ్డీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, తమిళనాడుకు చెందిన తిప్పన్న దగ్గర గేమ్ టెక్నిక్స్ నేర్చుకున్నా. నా కెప్టెన్సీలో నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం గర్వంగా ఉంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. ప్రొ–కబడ్డీ లీగ్లో ఆడాలనేది నా డ్రీమ్.
- మేకల రాకేష్ (కెప్టెన్), జాప్తి శివనూర్
పవన్ కుమార్ ఇన్స్పిరేషన్
మాది వ్యవసాయ కుటుంబం. టెన్త్ క్లాస్ తర్వాత కబడ్డీ ఆటమీద ఇష్టం పెరిగింది. ఆ ఇష్టం హాబీగా మారింది. కబడ్డీలో పవన్ కుమార్ శరావత్ ఇన్స్పిరేషన్. ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటున్నా.
- దండు రాజేందర్, దామరచెర్వు
టీం స్పిరిట్తో
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న కల్లుగీత కార్మికుడు. అమ్మ బీడీలు చుడుతుంది. ఒకేసారి రెండు మెడల్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. టీం స్పిరిట్తో ఆడటం వల్లనే నేషనల్ లెవల్లో ఛాంపియన్లుగా నిలిచాం.
- బండారి వంశీ గౌడ్, చల్మెడ
::: తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్, వెలుగు