మీరే క్యాండిడేట్లుగా గెలుపు కోసం పనిచేయాలి : రేవంత్​రెడ్డి

మీరే క్యాండిడేట్లుగా గెలుపు కోసం పనిచేయాలి : రేవంత్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో  నేను బరిలో ఉన్నప్పటికీ మీరే క్యాండిడేట్లుగా భావించి కాంగ్రెస్​ గెలుపు కోసం పని చేయాలని కామారెడ్డి అభ్యర్థి, టీపీసీసీ ప్రెసిడెంట్ ​రేవంత్​రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కామారెడ్డిలో కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. తనను ఇక్కడి నుంచి పోటీ చేసి కేసీఆర్​ను ఓడించాలని సోనియాగాంధీ, రాహుల్​గాంధీ సూచించారని చెప్పారు. కేసీఆర్​ను ఎదుర్కోడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.

మీరంతా ఒక్కక్కరు ఒక్కొక్క రేవంత్​రెడ్డి అనుకొని గెలుపుకోసం పని చేయాలన్నారు. ఏ బూత్​నుంచి మెజార్టీ తీసుకొస్తారో ఆ బూత్​ ఇన్​చార్జులతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్​ దండుపాలెం బ్యాచ్​ తిరుగుతోందని, వీరిని ఓడించాలన్నారు. కామారెడ్డి పోరాటాల గడ్డ అని, కేసీఆర్​ను ఓడించేందుకు ఇక్కడి ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి, షబ్బీర్​అలీ తమ జేబుల్లోనే ఉన్నట్లు భావించి కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు.

ఎవరి గ్రామంలో వారే ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్​రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, పార్టీ లీడర్లు పండ్ల రాజు, చంద్రకాంత్​రెడ్డి, అశోక్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, భీమ్​రెడ్డి, రమేశ్​ పాల్గొన్నారు.