కామారెడ్డి, వెలుగు : విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదని, ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లోని అంతర్రాష్ట చెక్ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు. జుక్కల్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి మాట్లాడారు. పోలింగ్ను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ మద్యం, డబ్బు, వస్తువులు రవాణా కాకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్షన్ ప్రవర్తన నియమావళి కచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

