
కరీంనగర్ టౌన్,వెలుగు: 2021 ఫిబ్రవరి నుంచి 27,580 దరఖాస్తులు రాగా 1,810 అర్జీలు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కోర్టు కేసుల వంటి కారణాలతో పరిష్కరించలేని దరఖాస్తులపై అర్జీదారుకు సమాచారం ఇస్తూ, ఆన్ లైన్లో నమోదు చేయాలని, మిగతా అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలదారుల 387 దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్లో జిల్లా ఫస్ట్ ప్లేస్ సాధించినట్లు చెప్పారు. అనంతరం 17 నుంచి అక్టోబర్ 2వరకు జిల్లాలో సెర్ప్, స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛత హీ సేవ పోస్టర్ను ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీడబ్ల్యూవో సరస్వతి, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేశ్బాబు పాల్గొన్నారు.