కరీంనగర్: నిబంధనల అతిక్రమణతో సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ పూర్తయ్యేదాకా తిరిగివ్వమని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. డీజీపీ ఆదేశాలతో ఆయన గురువారం నగరంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల కరోనా పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ‘లాక్డౌన్ నియమాలను కొంతమంది పాటించడంలేదు. అందుకే నేటి నుంచి లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తున్నాం. ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉన్న మార్కెట్లు, ఇతర షాపింగ్ ఏరియాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాం. కొందరు దుకాణాదారులు 10 గంటలు దాటినా దుకాణాలు మూసివేయడం లేదు. అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నిత్యావసర వస్తువులను నాలుగైదు రోజులకు సరిపడా ఒకేసారి కొనుక్కెళ్లాలి. అవసరమైతే ఏ ఏరియావాళ్లు ఆ ఏరియాల్లోనే కొనుగోలు చేసుకోవాలి. అనవసరంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేసి కోర్టులో సరెండర్ చేస్తాం. లాక్డౌన్ పూర్తయ్యేదాకా వాహనాలు తిరిగి ఇవ్వం. రెమిడిసీవర్, ఆక్సిజన్, అత్యవసర మందులు అమ్మేవారిపై నిఘా ఉంచాం. బుధవారం కూడా రెమిడిసీవర్ అమ్మేవారిపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఐదుగురిని పట్టుకున్నాం’ అని ఆయన తెలిపారు.