కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దే.. అలుగునూర్ చౌరస్తాను మోడల్‌గా తీర్చిదిద్దుతాం..

కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దే.. అలుగునూర్ చౌరస్తాను మోడల్‌గా తీర్చిదిద్దుతాం..
  •     మంత్రి శ్రీధర్ బాబు

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్‌లో 42 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్​లోని అలుగునూర్(8వ డివిజన్)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలుగునూర్ చౌరస్తాను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్​ సర్కార్​ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు అందిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని, బీజేపీ–బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, డాక్టర్​ అనురాధ, మాజీ ఎమ్మెల్యే మోహన్, సుడా చైర్​పర్సన్ నరేందర్​రెడ్డి పాల్గొన్నారు.

కేంద్రం విధానాలతో బంగారం పిరం..

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం, వెండి అందుబాటులో లేకుండా పోతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ధరలు ఆకాశాన్నంటడానికి కారణం ఏమిటో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్​లోని రాంనగర్, టెలిఫోన్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. త్వరలోనే కరీంనగర్​ డంపింగ్ యార్డును తరలిస్తామని తెలిపారు.