
- మయన్మార్ నుంచి రాగానే అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్, వెలుగు: కొలువుల పేరుతో ఇండియన్స్ను మయన్మార్ సైబర్ కేఫ్లకు తరలించిన కింగ్పిన్ హితేశ్(29)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ కథనం ప్రకారం.. మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన కొక్కిరాల లక్ష్మారెడ్డి కుమారుడు మధుకర్ రెడ్డి చైనీస్ జాబ్ అనే టెలిగ్రామ్ ఛానెల్లో వచ్చిన నోటిఫికేషన్ను చూసి ఉద్యోగం కోసం సంప్రదించాడు. ఆన్లైన్ ద్వారా తన వివరాలను పంపగా, ఆ కంపెనీ అతడిని ఎంపిక చేసింది.
హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కు వెళ్లిన తరువాత గుజరాత్కు చెందిన హితేశ్ వాట్సాప్ ద్వారా మధుకర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు. అక్కడి నుంచి థాయిలాండ్ సరిహద్దులో ఉన్న హాంగ్ షింగ్ కంపెనీకి తీసుకెళ్లి అగ్రిమెంట్ రాసుకొని సంతకం చేయించుకున్నారు. ఆ తరువాత సైబర్ నేరాలు చేయమని ఒత్తిడి చేయడమే కాకుండా, చేయకపోతే టార్చర్ చేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో తన తండ్రికి చెప్పడంతో ఆయన మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి సమస్య వివరించాడు.
ఆయన చొరవతో మయన్మార్ సైన్యం సైబర్ కేఫ్లపై దాడి చేసి 500 మందికి పైగా బాధితులను ఈ ఏడాది మార్చిలో ఇండియాకు పంపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుజరాత్కు చెందిన హితేశ్ ను మయన్మార్ ప్రభుత్వం స్వదేశానికి పంపింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి సాయంతో కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.