అమృత్సర్: సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభం కానుంది. చాన్నాళ్ల తర్వాత సిక్కుల కోసం పాకిస్థాన్ సరిహద్దులను భారత్ మళ్లీ తెరవబోతుంది. ఇవ్వాళ్టి నుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. దర్శనానికి అనుమతి పొందిన పలువురు భక్తులు అమృత్సర్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. పాకిస్థాన్ కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం.
పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని రావీ నది ఒడ్డున ఉన్న కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా.. భారత సరిహద్దుల నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ కారిడార్ పాకిస్థాన్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ గురుద్వారాను కలుపుతుంది. గురు నానక్ దేవ్ జీ తన జీవితం చివరి దశలో పలు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. దాదాపు చివరి 18 సంవత్సరాలు ఆయన కర్తార్పూర్లోనే గడిపారు. కాగా, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను చివరగా నవంబర్ 9, 2019న తెరిచారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 మార్చి 16న తాత్కాలికంగా మూసివేశారు.