కార్తీక‌మాసం రెండో రోజు నవంబ‌ర్ 15 పారాయ‌ణం... కార్తిక సోమవార వ్రత మహిమ  ఎంత గొప్ప‌దో తెలుసా...

కార్తీక‌మాసం రెండో రోజు నవంబ‌ర్ 15 పారాయ‌ణం... కార్తిక సోమవార వ్రత మహిమ  ఎంత గొప్ప‌దో తెలుసా...

కార్తీక మాసం శైవులకు , విష్ణు భక్తులకు అత్యంత ముఖ్యమైనది . కార్తీక మాసం లో కార్తీక పురాణం లో ఉన్న కధలను రోజుకొక కథగా చదువుతారు . ఇప్పుడు కార్తీక శుద్ద విదియ అన‌గా న‌వంబ‌ర్ 15 ( కార్తీక మాసం రెండో రోజు) పారాయ‌ణం చేయాల్పిన క‌థ‌ను ఇప్పుడు చూద్దాం. . .

ఓం విఘ్నేశ్వ‌రాయ‌న‌మః.. అథః  ద్వితీయోధ్యాయ  ప్రారంభః

శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః |

తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ||

జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసినాను.    కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.

కార్తీక‌ మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము౦డి, నదీ స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. 

భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను శ్రద్దగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట

పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల రోజుల‌కు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అభ్యసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచు౦డేడివారు. 

ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమాన‌ము  పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెకు 'కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని తీసుకొని వెళ్లి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచు వర్ణసంకరు రాలయ్యెను. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి కూడా దుర్భుద్ద‌లు నేర్పి పాడు చేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను.

జనక రాజా! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణములనుండి చీము, రక్తము రసికారుట ప్రార౦భమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులుయే ఒక్కరు ఇప్పుడామెను తొ౦గి చూడటంలేదు.

 ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునెటులైననూ పలుకరించునని, క‌నీసం ఆ వీధిలోకి కూడా వెళ్ల‌డం లేదు.  కర్కశ ఇటుల నరక బాధలనుభవించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీస‌కొని వెళ్లి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తీసుకువెల్లి ఎర్రగా కాల్చిన యినుప స్త౦భమునకు కట్టివేయ‌మ‌ని" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦దులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్త౦భమునూ కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారిణిలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లితండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦భీపాకమను నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు ఏడు తరాలవాళ్లు అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.

ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిబాధ పడలేక యిల్లిలు తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతమాచరించి ఉపవాసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కాళ్లు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాసం.... సోమవారమగుట వలను, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుటవలననూ, శివ పూజ పవిత్ర స్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦తరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేన౦దున లోనికేగాను. మరల 'రక్షింపుము రంక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టురాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వికుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. 

కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తీక‌ సోమవార వ్రతఫలమొకటి  ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను"యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను.

వింటివా జనక మహారాజా! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధచేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

ALSO READ : కార్తీక మాసం.. కీసరగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు