పోరు తెలంగాణ : మలిదశ పోరులో తొలి అమరుడు శ్రీకాంతాచారి

పోరు తెలంగాణ :  మలిదశ పోరులో తొలి అమరుడు శ్రీకాంతాచారి

ఆదిలాబాద్​ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా..! పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా..! ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్​ గల్లీల దాకా..! ఇందూరు, కరీంనగర్​, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. ఇది పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. ఇది త్యాగాల వీణ!! ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం.. ఉవ్వెత్తున ఎగిసింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరాటాలతో 2014 జూన్​ 2న రాష్ట్రం సిద్ధించింది. ఈ పోరు వెనుక ఎన్నో కీలక ఘట్టాలు.. మరెన్నో మైలు రాళ్లు. వాటిని ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం...


మలిదశ పోరులో తొలి అమరుడు శ్రీకాంతాచారి

  • 2001 ఏప్రిల్​ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్​. 
  • 2009 ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటుపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలిలో జాయింట్​ కమిటీ ఆఫ్​ మెంబర్స్​ ఏర్పాటు.
  • 2009 సెప్టెంబర్​ 2: హెలికాప్టర్​ ప్రమాదంలో అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం. రాజకీయ స్తబ్ధత. 
  • 2009 నవంబర్​ 29: టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష. దీక్షను భగ్నం చేసిన పోలీసులు. హైదరాబాద్​లోని నిమ్స్​కు కేసీఆర్​ తరలింపు.
  • 2009 నవంబర్​ 29 నుంచి డిసెంబర్​ 3 వరకు: మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ఇదే టైమ్​లో.  కేసీఆర్​ అరెస్ట్​కు నిరసనగా ఎల్బీ నగర్​ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబర్​ 3న అమరుడయ్యాడు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. 
  • 2009 డిసెంబర్​ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలంటూ కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటన. 
  • 2009 డిసెంబర్​ 23: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్రలోనూ ఉద్యమాలు. అక్కడి పలువురు ఎంపీల రాజీనామా. దీంతో ఏకాభిప్రాయం కుదరడం లేదని కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను హోల్డ్​లో పెట్టింది.