క్రేజీ కాంబో: కేజీఎఫ్ డైరెక్టర్‌‌తో ప్రభాస్ మూవీ!

క్రేజీ కాంబో: కేజీఎఫ్ డైరెక్టర్‌‌తో ప్రభాస్ మూవీ!

హైదరాబాద్: బాహుబలి సిరీస్‌‌తో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు. సాహోతో నార్త్ ఇండియా మార్కెట్‌‌లో తన క్రేజ్‌‌ను మరోమారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్‌‌, ఆ తర్వాత హిందీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌‌లో యాక్ట్ చేయబోయే ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీస్ కూడా ఇండియా స్థాయిలో తీస్తున్న ప్రాజెక్టులే. తాజాగా మరో భారీ మూవీకి ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం. కేజీఎఫ్‌‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫిల్మ్‌‌కు సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడనుంది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌‌గా, కేజీఎఫ్‌‌కు నిర్మించిన హొంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘ప్రియమైన అభిమానులారా, మీరెప్పుడూ మా సినిమాలను ప్రేమిస్తూ వస్తున్నారు. మీ ప్రేమను అలా పొందుతూనే ఉండాలనే ఆకాంక్షతో మరో భారతీయ చిత్రంతో ముందుకు రానున్నాం’ అని హొంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌‌లో డిసెంబర్ 2న మధ్యాహ్నం 2.09 గంటలకు సినిమా అప్‌‌డేట్స్‌‌ను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది. అధికారికంగా చెప్పనప్పటికీ ట్రేడ్ అనలిస్టులు ఈ మూవీలో ప్రభాస్ నటించనున్నాడని చెబుతున్నారు. ఈ ఫిల్మ్ యూనిట్‌‌ కూడా అనధికారికంగా ఈ వార్తలు నిజమేనని పేర్కొనడం గమనార్హం.