- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ డీస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సేకరణ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులకు భూసేకరణపై, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సీతారామ కింద రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.
సీతారామ ప్యాకేజీ 2 సంబంధించి 12ఎల్-ఆర్ఎం1 మైనర్ కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 12 వేల 454 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుందని, దీనికి సంబంధించి అవసరమైన భూముల సేకరణ కోసం పెనుబల్లి మండలంలో ఎస్డీఆర్ ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లూరు మండలంలో ఎంజాయ్ మెంట్ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు.
45 రోజుల గ్రామ సభ నిర్వహించి అవార్డు జారీ, తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలనిసూచించారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, సర్వేయర్లు, సంబంధిత మండల తహసీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
