- బెంగళూరులో ఖర్గేతో భట్టి, పొంగులేటి భేటీ
- అక్కడి నుంచి తుమ్మలకు ఫోన్
- ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసీసీ కసరత్తు
- రఘురాంరెడ్డి పేరు ఫైనల్ చేసినట్టు ప్రచారం
ఖమ్మం, వెలుగు: ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికె ట్ విషయంలో నెలరోజుల కసరత్తు క్లైమాక్స్కు చేరింది. టికెట్ కోసం పోటీపడుతున్న ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయాన్ని తెచ్చేందుకు ఏఐసీసీ తుది ప్రయత్నాలు చేసింది. బెంగళూరులో సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు.
అక్కడి నుంచే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖర్గే ఫోన్ చేసి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. తన భార్య నందిని కోసం భట్టి విక్రమార్క, కొడుకు యుగంధర్ కోసం తుమ్మల, తమ్ముడు ప్రసాద్ రెడ్డి కోసం పొంగులేటి పట్టుబట్టడంతో ఖమ్మం టికెట్ విషయంలో పీటముడి పడింది. ఈ ముగ్గురిని తప్పించి మిగిలిన అభ్యర్థులపై చర్చలు, రకారకాల ఈక్వెషన్లను హైకమాండ్ వర్కవుట్ చేసింది.
మండవ వెంకటేశ్వరరావు వంటి నాన్లోకల్అభ్యర్థులను కూడా పరిశీలనలోకి తీసుకుంది. వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, సీనియర్ లీడర్లు వీహెచ్, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. భట్టి, పొంగులేటి పట్టువీడకపోవడంతో మళ్లీ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేసింది.
ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కూడా రంగంలోకి దిగి భట్టి, పొంగులేటితో మాట్లాడారు. మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ను పక్కనబెట్టాలనే నిర్ణయం తీసుకోవడంతో చివరకు రాయల నాగేశ్వరరావు పేరును భట్టి విక్రమాwర్క, రామసహాయం రఘురాంరెడ్డి పేరును పొంగులేటి ప్రపోజ్ చేసినట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25వరకు మాత్రమే సమయం ఉండడంతో తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది గంటల్లో లిస్ట్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డిని క్యాండిడేట్గా ఫైనల్ చేసినట్టు సమాచారం.