రాష్ట్ర సహకారం లేకున్నా MMTS ప్రారంభిస్తున్నం -కిషన్ రెడ్డి

రాష్ట్ర సహకారం లేకున్నా MMTS ప్రారంభిస్తున్నం -కిషన్ రెడ్డి

ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను స్టార్ట్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రం సహకారం లేకున్నా.. MMTS ప్రారంభిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్, హైవేలు, బీబీనగర్ ఎయిమ్స్ వంటి వాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్న.. ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. 

తెలంగాణ ప్రజలకు చాలా రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘తెలంగాణలోని ప్రతి హిందూవు ఎప్పుడో ఒకసారి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. వారి సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వరకూ వందే భారత్ రైలును మోడీ అంకితం చేశారు. రూ.700 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను వచ్చే 40 ఏళ్ల వరకూ ప్రయాణికుల రద్దీకి  సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నాం. మహబూబ్ నగర్ కు ఇప్పటి వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. MMTS- 2 ప్రాజెక్ట్ ఆగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు. మేమే (బీజేపీ ఎంపీలు) ప్రధాని మోడీని అడిగి నిధులు తీసుకొచ్చాం’’ అని చెప్పారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్ని రాష్ట్రాలు సమానమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. లక్ష కోట్లకు పైగా తెలంగాణకు జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రధాని మోడీ నిధులు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎంతో లాభం చేశారని, రాష్ట్ర ప్రజలు మోడీకి మద్దతు తెలపాలని కోరారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని.. ప్రసంగించారు. 

తెలంగాణకు రూ.4 వేల కోట్లు

తెలంగాణ, ఏపీకి రెండు వందే భారత్ ట్రైన్స్ ను అందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ  వైష్ణవ్ చెప్పారు. వరల్డ్ క్లాస్ స్టేషన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వేబడ్జెట్ లో తెలంగాణకు నాలుగువేల కోట్లు కేటాయించామన్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ పేరుతో దేశాన్ని ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.