కోల్కతా/ న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో తమకు సెక్యూరిటీ కల్పించాలన్న డిమాండ్తో వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసనోద్యమం దేశమంతటా విస్తరించింది. ఇండియా నలుమూలల్లోని దాదాపు అన్ని సిటీల్లో శుక్రవారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. హైదరాబాద్ సహా అన్ని ముఖ్య నగరాల్లో శాంతి ర్యాలీలు చేపట్టారు. జూనియర్ల సమ్మెకు మద్దతుగా వందల మంది
సీనియర్ డాక్టర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అతి పెద్ద డాక్టర్ల సంఘమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ).. దేశవ్యాప్తంగా ఒక్క రోజు(సోమవారం) సమ్మెకు పిలుపిచ్చింది. జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగతా వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోల్కతా సిటీలో సమయానికి ట్రీట్మెంట్ అందక ఒకరిద్దరు చిన్నారులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరువల్లే డాక్టర్ల ఆందోళన ఉధృతమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. సమ్మె వల్ల పేద రోగులు చనిపోతున్నారని, డాక్టర్లు డ్యూటీల్లో చేరేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్తలు కోల్కతా హైకోర్టులో పిల్ దాఖలు చేయగా, దీనిపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆస్పత్రుల్లో డాక్టర్ల సెక్యూరిటీపై కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది. కోల్కతాలోని నీల్ రతన్ సర్కార్(ఎన్ఆర్ఎస్) మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి చనిపోయిన ఓ పేషెంట్ బంధువులు.. డ్యూటీలో ఉన్న ఇద్దరు జూనియర్ డాక్టర్లను చితకబాదడం, ఆ దాడిని నిరసిస్తూ, ఆస్పత్రుల్లో తమకు రక్షణ కల్పించాలంటూ జూడాల సంఘం సమ్మెకు దిగడం తెలిసిందే. మొదట కోల్కతాకే పరిమితమైన ఆందోళనలు.. శుక్రవారం నాటికి దేశవ్యాప్త ఉద్యమంగా మారింది.
సమ్మెలో మమత మేనల్లుడు
జూనియర్ డాక్టర్ల సమ్మెకు కేంద్రబిందువుగా కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో నాలుగో రోజైన శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. సిటీలోని ఇతర మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు ర్యాలీగా వచ్చి సమ్మె చేస్తున్న సహచరులకు మద్దతు పలికారు. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు డాక్టర్ అభేశ్ బెనర్జీ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ‘‘ఒకప్పుడు డాక్టర్లని దేవుళ్లు(గాడ్స్) అన్నారు.. ఇప్పుడేమో కుక్కల(డాగ్స్)లాగా ట్రీట్ చేస్తున్నారు’’అని రాసున్న పోస్టర్తో అభేశ్ నిరసన తెలిపారు. వెస్ట్బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా డాక్టర్లపై దాడిని ఖండిచారు.
అయ్యో బిడ్డా..
నాలుగు రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో వెస్ట్బెంగాల్లోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. రోజుల వయసున్న కూతురి మృతదేహంతో ఆస్పత్రి నుంచి బయటికొస్తూ ఏడుస్తున్న ఓ తండ్రి ఫొటో అందరిచేతా కన్నీరు పెట్టించింది. సేవ్ డాక్టర్స్, సేవ్ బెంగాల్ నినాదాల మధ్య చిన్నారులు బలైపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తమైంది.
దీదీ సారీ చెప్పాల్సిందే
తమ నిరసనోద్యమాన్ని అవమానించేలా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డాక్టర్ల యూనియన్లు డిమాండ్ చేశాయి. సీఎం సారీ చెప్పకుంటే ఎమర్జెన్సీ సేవల్ని కూడా నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చాయి. గురువారం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకొచ్చిన సీఎం మమత.. సమ్మె విరమించకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటానంటూ జూనియర్ డాక్టర్లకు అల్టిమేటం జారీచేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే సమ్మె చేస్తున్నారని, ఇదంతా బెంగాల్ను బద్నాం చేయడానికి బీజేపీ, కేంద్రం కలిసిపన్నిన కుట్ర అని ఆరోపించారు. సీఎం కామెంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆరు డిమాండ్లతో జూనియర్ డాక్టర్ల సంఘాలు శుక్రవారం విడుదల చేసిన నోట్లో సారీ అంశాన్ని కూడా చేర్చారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లకు పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్లో దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని నోట్లో పేర్కొన్నారు. డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన సీనియర్ నటి అపర్ణాసేన్.. సారీ చెప్పడం సిగ్గుపడాల్సిన విషయమేమీ కాదని సీఎం మమతకు సూచించారు.
300 మంది డాక్టర్ల రాజీనామా
అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లకు సెక్యూరిటీగా పోలీసుల్ని మోహరింపజేయాలన్న జూనియర్ల డిమాండ్కు సీనియర్ డాక్టర్లు మద్దతు పలికారు. సర్కార్ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది డాక్టర్లు, మెడికల్ కాలేజీ సిబ్బంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒక్క ఎస్ఎస్కేఎం హాస్పిటల్లోనే అత్యధికంగా 175 మంది డాక్టర్లు రిజైన్ చేశారు.
సోమవారం డాక్టర్ల బంద్
వెస్ట్బెంగాల్లో జూనియర్ డాక్టర్లపై దాడిని ఐఎంఏతీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా మూడురోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది. సోమవారం (జూన్ 17న) అన్ని ఆస్పత్రుల్లో సేవలు నిలిపేస్తామని ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ తప్ప మిగతా విభాగాలేవీ పనిచేయబోవని ఐఎంఏ బాధ్యులు వెల్లడించారు. బంద్లో ప్రైవేటు డాక్టర్లు కూడా పాల్గొంటారన్నారు. బంద్కు ముందు శని, ఆదివారాల్లో నల్లబ్యాడ్జ్లు, నిరసన ర్యాలీలు, ధర్నాలు చేస్తామన్నారు. డాక్టర్లపై దాడులు చేయడం సరికాదని, తగిన సెక్యూరిటీ కల్పించాలన్నదే తమ డిమాండ్ అని ఐఏంఏ పేర్కొంది.
హైదరాబాద్లోనూ జూడాల నిరసనలు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వాసు పత్రుల్లోజూనియర్ డాక్టర్లు కొద్ది గంటలపాటు విధులు బహిష్కరిం చారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్జే, నిమ్స్, ఎర్రగడ్డ మెంటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజిని దేవి ఐ హాస్పిటల్ లో ర్యాలీలు, దీక్షలు చేశారు.తలకు కట్లు కట్టు కుని నిరసన తెలిపారు. దీనికి సీనియర్ డాక్టర్లు , మెడికల్ ప్రొఫెసర్లు మద్దతుపలికారు.డాక్టర్లపై దాడులు జరగకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉస్మానియా జూనియర్డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ డిమాండ్ చేశారు.గాంధీ ఆస్పత్రిలో నల్లబ్యాడ్జ్లు ధరించిడ్యూటీకొచ్చిన జూనియర్ డాక్టర్లు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు.