నారసింహుడి రథోత్సవానికి పోటెత్తిన భక్తులు

నారసింహుడి రథోత్సవానికి పోటెత్తిన భక్తులు

కొల్లాపూర్, వెలుగు: మండలంలోని సింగోటం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  మంత్రి జూపల్లి కృష్ణారావు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. 

రథోత్సవాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జాతరలో కలియ తిరిగారు. 

ఓ షాపు యజమాని అభిమానంతో అందించిన చెరుకు గడ తింటూ భక్తులను ఉత్సాహపరిచారు. జాతర చివరి రోజు వరకు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆలయ చైర్మన్  ఆదిత్య లక్ష్మణ్ రావు, ఆలయ ధర్మకర్త చిలుకూరి రంగారావు, ఆర్డీవో నాగరాజు, సీఐ యాలాద్రి, ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, వంగా రాజశేఖర్ గౌడ్  పాల్గొన్నారు.