
హైదరాబాద్, వెలుగు: అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్ నుంచి జోనల్ సీసీఎఫ్లు, అన్ని జిల్లాల డీఎఫ్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్షించారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్నిప్రమాదాలు, వన్యప్రాణులకు తాగునీరు, ఆహారం కొరత రాకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
రాష్ట్రవ్యాప్తంగా అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి పరికరాలు వాడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగితే నివారించేందుకు ఎలాంటి ప్రణాళిక అనుసరించనున్నారని, అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏ జిల్లాలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడారు.
అడవులు, జూ లలో వన్యప్రాణులు, పక్షులకు తాగునీటి సదుపాయం కల్పించాలని, ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ వేసవిలో జంతువుల కోసం అడవుల్లో 2,168 నీటికుంటలు ఏర్పాటు చేశామన్నారు. నీటికుంటల్లో ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపాలన్నారు. నెహ్రూ, వరంగల్ జూ పార్కుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ (హెఓఎఫ్ఎఫ్) సువర్ణ, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఈలూసింగ్ మేరు, పీసీసీఎఫ్( స్కీమ్స్) జవహార్, వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్, చార్మినార్ జోనల్ పీసీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్ సునీల్ హీరామత్ పాల్గొన్నారు.