- లేకపోతే అసెంబ్లీ ముందు ధర్నా చేస్త
- దానంపై హైకోర్టులో పిటిషన్ వేశాం
హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కోవ లక్ష్మితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామిక తెలంగాణ అని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దానం నాగేందర్పై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేస్తుండగా.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
కడియం, తెల్లం వెంకట రావుపై పిటిషన్ ఇవ్వడానికి వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్ రూమ్లో దాక్కున్నారని ఆరోపించారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కచ్చితంగా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్తో పాటు మరికొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పార్టీ మారే వారి లిస్టులో తన పేరును చేర్చడం తగదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.