కృష్ణా నీళ్లలో మన వాటా పెరగలే

కృష్ణా నీళ్లలో మన వాటా పెరగలే
  • పంపకం నిరుటి లెక్కనే తెలంగాణకు 34%, ఏపీకి 66% 
  • 50% డిమాండ్​ చేసి.. 34%కే  ఓకే చెప్పిన మన సర్కారు
  • వాడివేడిగా కృష్ణా బోర్డు మీటింగ్​
  • శ్రీశైలం కరెంట్‌‌ ఉత్పత్తి ఆపాలన్న బోర్డు
  • కౌట్‌‌ చేసిన తెలంగాణ ఆఫీసర్లు
  • జ్యురిస్‌‌డిక్షన్‌‌ అమలుకు సహకరిస్తామని హామీ

హైదరాబాద్‌‌, వెలుగు:  కృష్ణా నీళ్లల్లో 50% వాటా ఇవ్వాలని డిమాండ్‌‌ చేసిన రాష్ట్ర సర్కారు.. నిరుటి మాదిరిగానే ఈ సారి 34 శాతం వాటాకు ఓకే చెప్పింది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి సాధించుకొని తీరుతామని సీఎం కేసీఆర్‌‌ పలుమార్లు చెప్పినా.. కృష్ణా బోర్డు మీటింగ్‌‌లో మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయాలే వచ్చాయి.  శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తిపై బోర్డు సూచనలకు అభ్యంతరం చెప్తూ సమావేశం నుంచి రాష్ట్ర అధికారులు వాకౌట్​ చేశారు. వాడివేడిగా సాగిన కృష్ణా బోర్డు మీటింగ్‌‌లో ఏపీకి పలు సానుకూల నిర్ణయాలు రాగా తెలంగాణకు నిరాశే ఎదురైంది. ఈసారి కూడా నిరుటి లెక్కనే 34:66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి కృష్ణా నీళ్ల పంపకాలకు ఓకే అయింది. కృష్ణా బోర్డు మీటింగ్​ను బాయ్​కాట్​ చేసి బయటకు వస్తున్న తెలంగాణ ఇరిగేషన్​ అధికారులు


కేఆర్‌‌ఎంబీ ఫెయిలైంది: రజత్‌‌కుమార్‌‌
ఏపీ బేసిన్‌‌ అవతలికి నీటిని తీసుకుపోకుండా కట్టడి చేయడంలో కృష్ణా బోర్డు ఫెయిలైందని తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ అన్నారు. కేఆర్‌‌ఎంబీ, జీఆర్‌‌ఎంబీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు ఏర్పడి ఏడేండ్లయినా టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. ప్రాజెక్టుల సమాచారం కావాలని బోర్డులు పదే పదే అడుగుతున్నాయని, ఒక్కో ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్‌‌ ఒక లారీ అంత సైజు ఉంటుందని, దాన్ని ఏం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేసి తీరుతామని, ఏపీ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లకు బదులుగా తాము 45 టీఎంసీల కృష్ణా నీళ్లను ఉపయోగించుకొని తీరుతామన్నారు.

విభజనకు ముందు ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వం: ఏపీ
రాష్ట్ర విభజనకు ముందు నిర్మించిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వబోమని మీటింగ్​లో చెప్పినట్లు ఏపీ వాటర్‌‌ రీసోర్సెస్‌‌ సెక్రటరీ శ్యామలరావు తెలిపారు. ట్రిబ్యునల్‌‌ తీర్పులను రెండు రాష్ట్రాలు అమలు చేసి తీరాలని తాము కోరామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు విభజన చట్టంలో లేదని, దాన్ని గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లో పేర్కొనడంపై అభ్యంతరం తెలిపినట్లు పేర్కొన్నారు. 
కేఆర్‌‌‌‌ఎంబీ 14వ సమావేశం బుధవారం ఉదయం హైదరాబాద్​లోని జలసౌధలో నిర్వహించారు. కేఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌ అధ్యక్షతన దాదాపు ఏడుగంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. నీటి పంపకాలు, కరెంట్‌‌‌‌ ఉత్పత్తిపైనే రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తెలంగాణ కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేసి వంద టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేసిందని, ఆ నీటిని తెలంగాణ కోటాలో లెక్కించాలని ఏపీ డిమాండ్‌‌‌‌ చేసింది. తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ స్పందిస్తూ.. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్రాజెక్టేనని తెలిపారు. బచావత్‌‌‌‌ అవార్డు ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి 34 టీఎంసీలు ఆవిరి నష్టాలు మినహా నీటిని తరలించడానికి ఆస్కారం లేదన్నారు. తెలంగాణ భూభాగం ఎగువన, నదులు కింద ప్రవహిస్తుండటంతో తమకు ఎత్తిపోతల పథకాలు తప్ప మరో మార్గం లేదని, అందుకే చవకగా వచ్చే కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. తమ కరెంట్‌‌‌‌ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతర పెట్టడం, కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపేయాలని బోర్డు లెటర్లు రాయడం సరికాదన్నారు. ఈ దశలో కేఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌ కలుగజేసుకొని.. నాగార్జునసాగర్‌‌‌‌, కృష్ణా డెల్టా కింద సాగు, తాగునీటి అవసరాలు ఉంటే తప్ప శ్రీశైలంలో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేయొద్దని సూచించారు. ఈ నిర్ణయంపై రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. బోర్డు నిర్ణయం ఎలా ఉన్నా కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేసి తీరుతామని చెప్పి సమావేశం నుంచి వాకౌట్‌‌‌‌ చేశారు.
జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ అమలుకు సహకరిస్తం: తెలంగాణ
కృష్ణా, గోదావరి బోర్డుల జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ అమలుకు సహకరిస్తామని తెలంగాణ తెలిపింది. కేఆర్‌‌‌‌ఎంబీ సమావేశం తర్వాత కృష్ణా, గోదావరి బోర్డుల జాయింట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌లోని క్లాజుల అమలు, ఆర్గనైజేషనల్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌పై చర్చించారు. జీఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌పై పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌ ఇచ్చారు. గెజిట్‌‌‌‌ అమలుపై కేంద్రానికి, బోర్డులకు సహకారం అందించడానికి తాము సిద్ధమని తెలంగాణ తెలిపింది. ప్రాజెక్టులన్నీ బోర్డులు తీసుకుంటే స్థానికంగా తలెత్తే సమస్యలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఎలా పరిష్కరిస్తారో క్లారిటీ లేదని తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌  అన్నారు. గెజిట్‌‌‌‌లోని సందిగ్ధ అంశాలు పరిష్కరించడానికి కో ఆర్డినేషన్‌‌‌‌ కమిటీ ఏర్పాటు చేయాలనే  సూచనలను  రెండు బోర్డుల చైర్మన్‌‌‌‌లు అంగీకరించారు. కాళేశ్వరం థర్డ్‌‌‌‌ టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు అందజేశారు. దేవాదుల థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌, చనాకా - కొరాట, మొండికుంటవాగు డీపీఆర్‌‌‌‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని, అవి కొత్త ప్రాజెక్టులు కాదని తెలిపారు. కందుకుర్తి, గూడెం ఎత్తిపోతల పథకాలు పాత ప్రాజెక్టులకు లోబడి చేపట్టినవేనని, వాటి డీపీఆర్‌‌‌‌లు కోరడం అర్థం లేదన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగానే రామప్ప - పాకాల డైవర్షన్‌‌‌‌ స్కీం చేపట్టామని, అది కూడా కొత్త ప్రాజెక్టు కాదని తెలిపారు.