కర్ణాటక ఎన్నికలు.. ప్రభుత్వ హోటళ్లలో 50 శాతం రాయితీ

కర్ణాటక ఎన్నికలు..  ప్రభుత్వ హోటళ్లలో 50 శాతం రాయితీ

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు హోటల్లు ఓటర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా కర్ణాటకలోని ప్రభుత్వ హోటళ్లు 50 శాతం తగ్గింపును ప్రకటించాయి. ఈ ఆఫర్‌ను మే 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే అన్ని కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మయూర హోటళ్లలో పొందవచ్చు. పోలింగ్ రోజున బయటకు వెళ్లి ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించేందు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లను ప్రోత్సహించడానికి, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ యాజమాన్యంలోని 'మయూర' హోటళ్లలో బసపై 50% ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటు వేసే ప్రజలకు/పర్యాటకులకు ఈ ప్రత్యేక రాయితీని వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ ను పొందాలనుకునే తప్పనిసరిగా ఓటు వేయాలని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే మయూర హోటళ్లు కర్ణాటక అంతటా, రాష్ట్రంలోని అన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఉన్నాయి.

 కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలు ఇప్పటికే హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించాయి. మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి జేడీ (ఎస్) కూడా కర్ణాటక రాజకీయాల్లో  కీలక పాత్ర పోషించబోతుండడం గమనార్హం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడనున్నాయి.