- పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్పర్సన్ సంధ్యారాణి భర్త రాజారమేశ్ మధ్య వివాదం పోలీస్స్టేషన్కు చేరింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో వార్డుల్లో సమస్యలు తెసుకునేందుకు బుధవారం ఉదయం కమిషనర్ తన సిబ్బందితో పర్యటించారు. ఒకటో వార్డులో కమిషనర్ టీం పర్యటిస్తుండగా చైర్పర్సన్ భర్త రాజారమేశ్, బీఆర్ఎస్ లీడర్రామిడి కుమార్, ఇతరులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అత్యవసర విధులు నిర్వహిస్తున్న తనకు, సిబ్బందికి ఆటంకం కలిగించడంతో పాటు అసభ్యకరంగా బూతులు తిడుతూ అంతుచూస్తానని చైర్పర్సన్ భర్త రాజారమేశ్ బెదిరించాడని, ఆయనపై చర్య తీసుకోవాలంటూ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, దళిత మహిళ అయిన చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లను అవమానిస్తూ, కుల వివక్షతో మాట్లాడి భౌతిక దాడికి దిగిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలంటూ రాజారమేశ్ సైతం ఫిర్యాదు చేశాడు. అనంతరం కమిషనర్ను సస్పెండ్చేయాలంటూ మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కాగా మున్సిపల్ కమిషనర్పై రాజారమేష్, బీఆర్ఎస్ లీడర్ల దాడిని కాంగ్రెస్ లీడర్లు ఖండించారు. రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ యాకుబ్అలీ, లీడర్ గోపు రాజం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు, బెదిరింపులు, రాజకీయ దౌర్జన్యాలు జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జోక్యంతోనే ఇలాంటి సంఘటనలు జరగుతున్నాయని ఆరోపించారు. ----
