న్యూఢిల్లీ: పేటీఎం, జొమాటో, నైకా వంటి ఐపీఓల వలన లక్షల మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. దీంతో రెగ్యులేటరీ సెబీ ఐపీఓ రూల్స్ను కఠినం చేసింది. అనుమతులు ఇవ్వడంలో జాగ్రత్త పడుతోంది. గత రెండు నెలల్లో అరడజను కంపెనీలు ఫైల్ చేసిన ప్రిలిమినరీ పేపర్లను రిజెక్ట్ చేసి, తిరిగి పంపించేసింది. ఇందులో ఓయో హోటల్స్ను ఆపరేట్ చేస్తున్న హాస్పిటాలిటీ కంపెనీ ఓరవల్ స్టేస్ కూడా ఉంది. తమ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) పేపర్లను అప్డేట్ చేసి మళ్లీ ఫైల్ చేయాలని సెబీ ఈ కంపెనీలను ఆదేశించింది. ఓయోతో పాటు కెనడా కంపెనీ ఫెయిర్ఫాక్స్ గ్రూప్కు చెందిన గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్, మొబైల్స్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, బీ2బీ పేమెంట్స్ కంపెనీ పేమేట్ ఇండియా, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ కంపెనీ బీవీజీ ఇండియాల డీఆర్హెచ్పీ పేపర్లను రిజెక్ట్ చేసి, మళ్లీ ఫైల్ చేయాలని ఆదేశించింది.
ఈ కంపెనీలు 2021,సెప్టెంబర్– మే, 2022 మధ్య తమ ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేశాయి. రూ.12,500 కోట్లను సేకరించాలని రెడీ అయ్యాయి. 2022 లో ఒక ఐపీఓకి అనుమతి ఇవ్వడానికి సెబీ సగటున 115 రోజులు తీసుకుంది. ఐపీఓ పేపర్లను ఫైల్ చేసేటప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ను కచ్చితంగా మర్చంట్ బ్యాంకులు ప్రొవైడ్ చేయాలనే సందేశాన్ని సెబీ ఇచ్చిందని మూలాహ్ సీఈఓ ప్రాఖర్ పాండే అన్నారు. గతంలో పూర్తి డాక్యుమెంట్లను ఫైల్ చేయడానికి కొంత టైమ్ ఇచ్చేదని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 9 కంపెనీలే సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లను ఫైల్ చేశాయి. దివ్గీ టార్క్యూట్రాన్స్ఫర్, గ్లోబల్ సర్ఫేస్.. రెండు కంపెనీలే ఐపీఓకి వచ్చాయి. కాగా,పేటీఎం ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సేకరించింది. 2021, నవంబర్లో కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. లిస్టింగ్ ధరతో పోలిస్తే కంపెనీ షేర్లు ఇప్పటికీ 72 % తక్కువకు ట్రేడవుతున్నాయి.