- పోలీసులకు వెల్లడించిన మాస్టర్ మైండ్ లలిత్ ఝా
న్యూఢిల్లీ: పార్లమెంట్ స్మోక్ అటాక్ ఘటనలో ప్లాన్ ‘బీ’ కూడా సిద్ధం చేసుకున్నట్లు మాస్టర్ మైండ్గా భావిస్తున్న లలిత్ ఝా పోలీసులకు తెలిపాడు. గురువారం రాత్రి కర్తవ్యపథ్ స్టేషన్ లో లలిత్, మహేశ్ పోలీసులకు లొంగిపోయారు. స్మోక్ అటాక్ గురించి వివరిస్తూ.. ‘‘ప్లాన్ ‘ఏ’ ప్రకారం.. నీలం దేవి, అమోల్ షిండే పార్లమెంట్కు చేరుకోవాలి. ఒకవేళ వీళ్లని ఎవరైనా అడ్డుకుంటే.. వెంటనే ప్లాన్ ‘బీ’ అమలు చేయాలని భావించాం. ప్లాన్ ‘బీ’ ప్రకారం.. మహేశ్, కైలాశ్లు వేరే మార్గం గుండా పార్లమెంట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. క్యానిస్టర్లను నుంచి ఎల్లో గ్యాస్ ఓపెన్ చేసి.. మీడియా కెమెరాల ముందు స్లోగన్స్ చేయాలి. ఇది ముందుగా అనుకున్న ప్లాన్. అయితే.. లాస్ట్ మినిట్లో నీలం దేవి, అమోల్ షిండేలను ప్లాన్ ‘ఏ’ అమలు చేయాలన్నాను” అని లలిత్ చెప్పాడు.
నలుగురి సెల్ఫోన్స్ తగులబెట్టిన లలిత్
ప్రూఫ్స్ దొరక్కుండా నలుగురి సెల్ఫోన్లను రాజస్థాన్లో తానే తగులబెట్టినట్లు లలిత్ వివరించాడు. కాగా, నిందితులు బూట్ల కింద ఉండే సోల్ను కట్ చేసి అందులో గ్యాస్ క్యానిస్టర్లను అమర్చి పార్లమెంట్ లోపలకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురిపై టెర్రరిజం చార్జెస్తో పాటు ‘ఉపా’ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లలిత్ ఝాను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారం రోజులు పోలీసు కస్టడీ ఇచ్చింది.