- తొమ్మిది నెలల్లో 21 శాతం పెరుగుదల
- 8 లక్షల క్లెయిమ్స్ పరిష్కారం
- రూ.16,946 కోట్ల చెల్లింపు
మనదేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి కరోనా మహమ్మారి కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు డెత్ క్లెయిమ్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఐఆర్డీఏకు ఎల్ఐసీ అందించిన చేసిన డేటా ప్రకారం ఏప్రిల్–-డిసెంబర్ మధ్య డెత్ క్లెయిములు 8 లక్షలను దాటాయి. అంతకుముందు ఏడాదిలో ఇదేకాలంతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. ఇంత తక్కువకాలంలో ఇన్ని క్లెయిములు రావడం ఇదేమొదటిసారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ క్లెయిముల పరిష్కారానికి ఎల్ఐసీ మృతుల కటుంబాలకు రూ .16,946 కోట్లు చెల్లించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 35.54 శాతం ఎక్కువ. ఈ క్లెయిముల్లో దాదాపు సగం అక్టోబర్–-డిసెంబర్లో పరిష్కారమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్లెయిములకు ఎల్సీఐ రూ .17,420 కోట్లు చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర డేటాను ఇంకా విడుదల చేయలేదు.
కరోనాయే కారణం...
డెత్ క్లెయిమ్స్ రికార్డుస్థాయిలో పెరగడానికి కారణమేంటో ఎల్ఐసీ చెప్పలేదు కానీ క్లెయిములన్నీ ఆరు నెలల లోపే వచ్చాయని ప్రకటించింది. దీనిని బట్టే చూస్తే వీటిలో కరోనా కేసులూ ఉన్నాయని అర్థమవుతోంది. ఇవన్నీ ఫస్ట్వేవ్ కేసులని, సెకండ్ వేవ్లో క్లెయిమ్లు మరిన్ని పెరుగుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. మనదేశంలో కరోనా వల్ల 1.71 లక్షల మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో తరువాత అత్యధిక మరణాలు ఇండియాలోనే రికార్డయ్యాయి. గత ఏడాది అక్టోబరు–డిసెంబరు మధ్య ఎల్ఐసీ 3.6 లక్షల క్లెయిమ్స్కు డబ్బు చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ఇంత భారీ కేసులు ఈ మూడు నెలల్లోనే వచ్చాయి. కరోనా మహమ్మారి ఇన్సూరెన్స్ సెక్టార్ను దెబ్బతీస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.