ఎల్ఐసీలో 3.5% వాటా అమ్మకానికి ఓకే

ఎల్ఐసీలో 3.5% వాటా అమ్మకానికి ఓకే

న్యూఢిల్లీ: లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ) కోసం చకచకా ఏర్పాటు జరుగుతున్నాయి. స్టేక్​ డైల్యూషన్​ విధానంలో 3.5 శాతం వాటాను పబ్లిక్​ ఆఫర్​ ద్వారా అమ్మడానికి ఎల్​ఐసీ బోర్డు  ఓకే చెప్పింది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నట్టుగా మార్కెట్​ పరిస్థితులను బట్టి దీనిని ఐదు శాతానికి పెంచేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. శనివారం జరిగిన బోర్డు మీటింగులో వాటాను అమ్మడం​పై నిర్ణయం వెలువడిందని ఈ విషయం తెలిసిన సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. ఈ నిర్ణయానికి రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం ఎఫెక్ట్ ఇంకా తగ్గనే లేదు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్​ ఆసక్తిని బట్టి వాటా పెంపుపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు. “ఐదు శాతం పరిమితి ఇప్పటికీ ప్రపోజల్స్​లో ఉంది. ప్రస్తుత డిమాండ్ ప్రకారం, మార్కెట్లు దాదాపు 3.5 శాతం వరకు సపోర్ట్​ చేస్తాయి. పరిస్థితులను బట్టి ఇది ఐదు శాతం వరకు వెళ్తుంది” అని ఆఫీసర్​ చెప్పారు. రూ.ఆరు లక్షల కోట్ల వాల్యుయేషన్​తో రూ. 21 వేల కోట్ల నుంచి- రూ. 30 వేల కోట్ల వరకు ఐపీఓ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

బుధవారం మరిన్ని వివరాలు...
ఎల్​ఐసీ వర్గాలు అందజేసిన సమాచారం ప్రకారం.. మే మొదటి వారంలో ఐపీఓ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి రానుంది. పాలసీహోల్డర్లకు రిజర్వేషన్లు, డిస్కౌంట్లు, ఇష్యూ ధర బుధవారం ఉదయం నాటికి ఖరారవుతాయి. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖకు వేసిన ప్రశ్నలకు శనివారం సాయంత్రం వరకు స్పందన రాలేదు. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా నిలవనుంది. తుది గడువు మే 12  కంటే ముందే ఆఫర్​ మొదలవుతుందని, ఆ తర్వాత మార్చి క్వార్టర్​ ఫలితాలతో డీఆర్​హెచ్​పీని రీఫైల్ చేస్తారని అంటున్నారు. గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ, ఎల్ఐసీ పబ్లిక్​ ఆఫర్‌‌‌‌‌‌‌‌పై పెట్టుబడిదారులకు చాలా ఆసక్తి ఉందని, అయితే ఐపీఓ లిస్టింగ్​ విజయవంతం అవుతుందన్న నమ్మకం వచ్చినప్పుడే కేంద్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఎల్​ఐసీ ఐపీఓ విజయవంతం కావడం ప్రభుత్వానికి చాలా ముఖ్యం. డిజిన్వెస్ట్​మెంట్​ టార్గెట్లు చేరుకోవడంలో ఎల్​ఐసీ వాటాల అమ్మకం చాలా కీలకం. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల అమ్మకాల ద్వారా వసూలు చేయాల్సిన మొత్తాన్ని రూ.65వేల కోట్లకు తగ్గించారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో విధించిన టార్గెట్​ రూ.78వేల కోట్ల కంటే ఇది తక్కువ. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా దాడి కారణంగా 2022  ప్రభుత్వం ఫైనాన్షియల్​ ఇయర్​ టార్గెట్​లో 17 శాతం తక్కువ వసూలు చేయగలిగింది. స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో హెచ్చుతగ్గులు పెరగడంతో ఎల్​ఐసీ వాటా అమ్మకాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయవలసి వచ్చింది. మే 12 తరువాత కూడా ఐపీఓ మొదలుకాకుంటే, మరో రెండు నుండి మూడు నెలలు వరకు ఇష్యూ ఆలస్యం అవుతుంది.

ప్రీమియం వసూళ్లు విలువ రూ.1.98 లక్షల కోట్లు
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఎల్​ఐసీ ప్రీమియం వసూళ్లు 7.9 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరుకున్నాయి.  మార్కెట్ వాటా 63.25 శాతానికి చేరింది. పోయిన ఫైనాన్షియల్​ ఇయర్​ కంటే ఇది తక్కువే! ఈ ఏడాది మార్చిలో  కంపెనీ ప్రీమియం వసూళ్లు అంతకు ముందు సంవత్సరం మార్చి కంటే 51 శాతం పెరిగి రూ.42,319.22 కోట్లకు చేరాయి. 71 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఎల్​ఐసీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో 2.17 కోట్ల బీమా పాలసీలను అమ్మింది. ఇది పోయిన ఆర్థిక సంవత్సరం కంటే 3.54 శాతం ఎక్కువ. అమ్మిన పాలసీల పరంగా దాని మార్కెట్ వాటాను 74.6 శాతానికి పెంచుకుంది. 

ఎల్​ఐసీ మెగా ఐపీఓపై కనీసం 12 భారీ ఫారిన్​, డొమెస్టిక్​ ఫండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థలు ఎంతో ఆసక్తి  చూపిస్తున్నాయి. భారతదేశంలోని కనీసం ఐదు టాప్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీలు , కనీసం మూడు పెద్ద విదేశీ సావరిన్ ఫండ్‌‌‌‌‌‌‌‌లు, రెండు గ్లోబల్ పెన్షన్ ఫండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీలు, రెండు గ్లోబల్ హెడ్జ్ ఫండ్‌‌‌‌‌‌‌‌లు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసి ఐపిఓను నిర్వహించే బ్యాంకర్లకు రూ.18 వేల కోట్లు పెట్టుబడిగా అందించడానికి రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ యాంకర్ ఇన్వెస్టర్లుగా రూ. 8 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.